చేతులు ఎత్తేస్తున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు!

Update: 2022-04-05 01:30 GMT
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డానికి శ‌త విధాల క‌ష్ట‌ప‌డింది ఎవ‌రు అంటే.. ఎలాంటి సందేహం లేకుండా.. చెప్పే స‌మాధానం.. కార్య‌క‌ర్త‌లు. ఈ విష‌యాన్ని ఎవ‌రో చెప్ప‌డం కాదు.. స్వ‌యంగా ఓ సంద‌ర్భంగా వైసీపీ అధినేత‌గా జ‌గ‌నే ఒప్పుకున్నారు. కార్య‌క‌ర్త‌లే మ‌న‌కు పంచ‌ప్రాణాలు అంటూ.. 2017లో జ‌రిగిన‌.. ప్లీన‌రీలో ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. కార్య‌క‌ర్త‌ల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఉంటుంద‌ని కూడా అన్నారు. దీంతో కార్య‌క‌ర్త‌లు.. అన్ని స్థాయిల్లోనూ.. పార్టీని గెలిపించేందుకు ప్ర‌య‌త్నించారు. కాలికి బ‌లపం క‌ట్టుకుని.. గ్రామాలు, న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో ఇంటింటికీ తిరిగారు. కొన్ని చోట్ల సొంత డ‌బ్బులు క‌ర్చు పెట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేశారు.

జ‌గ‌న‌న్న సీఎం అయితే..చాలా మా ద‌శ తిరుగుతుంది.. మా బ‌తుకులు వెలిగిపోతాయ‌ని అనుకున్నారు. జ‌గ‌న్ సీఎం అయ్యాడు. కానీ.. కార్య‌క‌ర్త‌ల జీవితాల్లోనే ఎలాంటి వెలుగులూ రాలేదు. క‌నీస మార్పున‌కూ నోచుకోలేదు. ఇక్క‌డ మ‌రో అత్యంత చిత్ర‌మైన విష‌యం కూడా ఉంది. కార్య‌క‌ర్త‌లు చెబుతున్న మాటే కాదు.. కొంద‌రు మంత్రులు కూడా ఇదే విష‌యాన్ని కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ ముందు వెల్ల‌డించారు. అదేంటంటే.. ``సార్‌.. టీడీపీ హ‌యాంలో మా మీద‌.. మా అనుచ‌రుల మీద‌, మ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల మీద అనేక త‌ప్పుడు కేసులు పెట్టారు. ఇప్ప‌టికీ .. ఆ కేసులు అలానే ఉన్నాయి. ఇప్ప‌టికీ వాళ్లంతా ప‌నులు మానుకుని.. ఖ‌ర్చు పెట్టుకుని కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. వాటిని ఉప‌సంహ‌రించుకోండి సార్‌`` అని మంత్రులే ప్రాధేయ ప‌డ్డారు.

అయితే.. ఇప్ప‌టికీ.. ఆ దిశ‌గా సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఒక్క‌టి కూడా లేదు. గ‌త ప్ర‌భుత్వంలో న‌మోదైన కేసుల విష‌యంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టి కీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక‌, ఆర్థికంగా. . వారికి ఎలాంటి ద‌న్నూ లేకుండా పోయింది. అంతేకాదు.. క‌నీసం.. కార్య‌క‌ర్త‌లు త‌మ ఇంట్లో వృద్ధుల‌కు కూడా పింఛ‌న్లు ఇప్పించుకోలేక పోతున్నార‌ని.. ఇటీవ‌ల శ్రీకాకుళంలో ఒక టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది ఇక‌, తూర్పులో అయితే.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు అనే పేరుతో.. పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కంలో ఇల్లు కూడా కేటాయించ‌లేదు. నిజానికి ఆ కార్య‌క‌ర్త కుటుంబం అర్హులే అయినా.. ఇల్లు కేటాయించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వారంతా కూడా ప్ర‌భుత్వం పైనా.. పార్టీ నేత‌ల‌పైనా .. తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

మ‌మ్మ‌ల్ని వాడుకుని వ‌దిలేస్తున్నారు! అంటూ. తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు.. ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దింపుతోంది. త్వ‌ర‌లోనే ఇంటింటికీ తిర‌గాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ తీవ్రంగా ఉంటున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు నాయ‌కులు ప్ర‌తి ఒక్క‌రూ.. ప‌నిచేయాల‌ని.. సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల అంద‌రినీ ఆదేశించారు. దీంతో త్వ‌ర‌లోనేనే.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ పేరుతో నేత‌లు.. ఎమ్మెల్యేలు.. కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ కానున్నారు. మ‌రి .. ఇప్పుడు వారికి ఎవ‌రు కావాలి.. వారి జెండాల‌ను ఎవ‌రు మోయాలి?  వారి త‌ర‌ఫున ఎవ‌రు బ్యాన‌ర్లు క‌ట్టాలి?

అంటే.. కార్య‌క‌ర్త‌లే!  అయితే..ఇక్క‌డే కార్య‌క‌ర్త‌లు రివ‌ర్స్ అయ్యారు. మేం రాం! అని తేల్చిచెబుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే నాయ‌కులు పార్టీ కూడా ప్త‌రిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న ఈ కార్య‌క్ర‌మానికి తాము పార్టిసిపేట్ చేసేది లేద‌ని.. కార్య‌క‌ర్త‌లు చెబుతున్నార‌ని.. నాయ‌కులే గుస‌గుస‌లాడుతున్నారు. అంతేకాదు.. మీరెంతో ముచ్చ‌ట‌ప‌డి తెచ్చుకున్న వ‌లంటీర్ల‌ను తీసుకువెళ్లండ‌ని కూడా కార్య‌క‌ర్త‌లు మొహం మీదే చెప్పేందుకు రెడీ అవుతున్నార‌ని సీనియ‌ర్లే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా కూడా.. క‌నీసం..వారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం.. గత ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వారిని గాలికి వ‌దిలేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని.. ప‌లువురు నాయ‌కులు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా అధినాయ‌క‌త్వం మేల్కొంటుందా? అనేది చూడాలి.
Tags:    

Similar News