వాకింగ్ ట్రాక్లు-కబ్జాలపై ఉక్కుపాదం: బీజేపీ మేనిఫెస్టో
తాము మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో విజయం దక్కించుకుంటే.. ప్రజలు తమకు అండగా ఉంటే.. గెలిచిన తర్వాత.. ఏం చేస్తారో.. వివరిస్తూ.. పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు మేనిఫెస్టో విడుదల చేశారు.;
ఎన్నికలు ఏవైనా పార్టీలు ఇప్పుడు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పార్టీలు మేనిఫెస్టోలు ఇచ్చేవి. తమను ఎన్నుకుంటే.. ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పేవి. ఇక, వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మేనిఫెస్టోలు ఇవ్వడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికలు అనగానే మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు.
గత ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి నాయకులు మేనిఫెస్టో ఇచ్చారు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన తర్వాత.. సదరు మేనిఫెస్టో ఏమైందో ఆయనకే తెలియాలి. ఇక, ఇప్పుడు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల హోరు, జోరు కొనసాగుతోంది. ఈ నెల 11న ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం బీజేపీ తన అభ్యర్థుల తరఫున ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది.
తాము మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో విజయం దక్కించుకుంటే.. ప్రజలు తమకు అండగా ఉంటే.. గెలిచిన తర్వాత.. ఏం చేస్తారో.. వివరిస్తూ.. పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు మేనిఫెస్టో విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా 10 హామీలను గుప్పించారు. తాము మునిసిపాలిటీల్లో విజయం దక్కించుకున్న వెంటనే ఈ మేనిఫెస్టోను కౌన్సిల్లో ఆమోదించుకుని అమలు చేస్తామని చెప్పారు.
ఇవీ హామీలు..
1) అన్ని మునిసిపాలిటీల్లోనూ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. 2) యువతకు లైబ్రరీలు. 3) వృద్ధులు సేద దీరేందుకు వాకింగ్కు ఉద్యానవనాలు. 4) అవినీతి రహితంగా మునిసిపాలిటీలను తీర్చిదిద్దడం. 5) అ-శీళ్లను రద్దు చేయడం. 6) అన్ని ఇళ్లకు తాగు నీరు అందించడం. 7) జల్ జీవన్ మిషన్ ను పూర్తిగా వినియోగించుకోవడం. 8) ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేయడం. 9) ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను అభివృద్ధికే వినియోగించడం. 10) భూముల కబ్జాను నివారించడం.