మీరు గాడ్సే వారసులు: బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో గాడ్సే వారసులు పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టిన నిరసనలో రాహుల్ గాంధీని అరెస్టు చేసిన తీరును ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీట్ ప్రశ్న పత్ర లీకేజీ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. వందలాది పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను లీక్ చేశారని తెలిపారు. పత్రపత్రాలను డబ్బులకు అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారిపై బల ప్రయోగం చేయడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రషశ్నించారు. అయి నా.. ప్రశ్నించడం ఆపబోమని చెప్పారు. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని.. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ``నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి'' అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే రాజీనామా చేయించాలని కోరారు.
రాహుల్ను కొట్టారు.
నిరసనలో ఉన్న రాహుల్గాంధీపై ఢిల్లీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై బలప్రయోగం చేశారని తెలిపారు. ఫలితంగా ఆయన ముక్కు నుంచి రక్తం కారిందన్నారు. మహాత్మా గాంధీని పొట్టన బెట్టుకున్న గాడ్సే వారసులు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నిరసనలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.