గ్రేట్ జాబ్: కరోనా రోగులకు దీంతో సత్ఫలితాలు

Update: 2020-04-09 08:50 GMT
అమెరికాలో రోజుకు 1800 మంది.. ఇటలీ - స్పెయిన్ లో 1000లోపు మంది మరణిస్తున్నారు. లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అక్కడ కరోనా సోకిందంటే వెంటిలేటర్ లభించక వృద్ధులను మరణానికే వదిలేస్తున్న పరిస్థితి. కానీ ఆశ్చర్యం.. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్న వారి సంఖ్య అమోఘంగా ఉంది. ఏపీలోనూ వైద్యులు కరోనా రోగులను ఇట్టే నయం చేసి ఇంటికి పంపిస్తున్నారు. తాజాగా ఏపీలో 9మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ ను తెలుగోళ్లు - తెలుగు రాష్ట్రాల వైద్యులు ఎలా కట్టడి చేస్తున్నారు..? ఏంటా సీక్రెట్? ఇప్పుడు ఇదే ప్రపంచదేశాలను - భారత్ ను మనవైపు చూసేలా చేస్తోంది.

కరోనాకు చికిత్స అంత ఈజీగా కాదని.. అమెరికా - యూరప్ - చైనా మరణాలు చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే మన దగ్గర వెంటిలేటర్ వద్దకు కూడా పోకుండా మందులు - మనోదైర్యం - మంచి పౌష్టికాహారంతో ఇట్టే నయం చేస్తున్నారు వైద్యులు.. అది ఎలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రపంచదేశాలకు కూడా అంతుచిక్కడం లేదు. ఆ కరోనా సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..

కరోనావైరస్ సోకిన వారిని 14రోజుల పాటు ఒకే గదిలో ఉంచి చికిత్స చేయాలి. వారికి తీవ్ర మానసిక ఒత్తిడి - ఆందోళన పీక్ స్టేజ్ లో ఉంటుంది.వీరికి మందులిస్తే సరిపోదు.. కావాలసిన మనోధైర్యం - పౌష్టికాహారం కూడా ఇవ్వడం అత్యంత అవసరం. తెలంగాణలోని గాంధీ ఆస్పత్రితోపాటు ఏపీలో కరోనా రోగులకు మంచి పౌష్టికాహారం అందిస్తూ మందులు వాడిపిస్తూ వారిలో మనో నిబ్బరాన్ని కలిగిస్తూ కరోనాను నయం చేస్తున్నారు.

*తెలంగాణలో గాంధీ వైద్యుల గొప్ప ఘనత

గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ రోగులకు అద్భుతమైన చికిత్స అందుతోంది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న 310మంది పాజిటివ్ రోగులు పూర్తిగా కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి 27మంది డిశ్చార్జి అయ్యారంటే వీరి ఘనతను అర్థం చేసుకోవచ్చు. 12 ఏళ్లలోపు పిల్లలు 20 మందిని వైద్యులు కరోనా నుంచి విముక్తి చేశారు. ఐసోలేషన్ లో 200 మంది ఉన్నారు. 

ప్రధానంగా ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే మనిషికి ప్రధానంగా కావాల్సింది ఇమ్యూనిటీ.. మందులు మాత్రమే సరిపోవు.. పౌష్టికాహారం కూడా ముఖ్యమే.  అందుకే కరోనా పాజిటివ్ రోగులకు గాంధీ ఆస్పత్రిలో వారు కోరుకునే ఆహారం అందిస్తున్నారు. ఉదయం అల్పాహారంతోపాటు టిఫిన్ - టీ ఇస్తున్నారు. ఇడ్లీ - దోశ - చపాతీ - పాలు - బ్రెడ్డులను ఆర్డర్ చేస్తున్నారు. వారికి కావాల్సిన ఆహారం పంపిణి చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో రెండు కూరలు - పెరుగు - గుడ్డు - సాంబార్ ఇస్తున్నారు. సాయంత్రం బాదం - జీడిపప్పు - డ్రైఫ్రూట్స్ ఇతర పండ్లను ఆహారంగా ఇస్తున్నారు. వీటిద్వారా రోగికి ఇమ్యూనిటీ పెరుగుతుంది.  ఇక రాత్రికి రైస్ - చపాతీ అందిస్తున్నారు. నాలుగు లీటర్ల మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు.

ఇక రోగితో తరచూ నర్సులు - డాక్టర్లు మాట్లాడుతూ వారికి మనోధైర్యం కల్పిస్తూ అవగాహన పెంచుతున్నారు. పౌష్టికాహారం - మందులు - మనో నిబ్బరం కారణంగా తెలంగాణలో రోగులు త్వరగా కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

*ఏపీలో అంతకుమించి పౌష్టికాహారం

ఇక ఏపీలోనూ కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నారు. విజయవాడ డివిజన్ లోని పెనమలూరు మండలం గంగూరు క్వారంటైన్ లో ఉన్న రోగులకు ఇమ్యూనిటీ పెంచేందుకు ప్రధానంగా రెండు అరటి పండ్లు - ఉడికించిన రెండు కోడిగుడ్లు - బాదం - పిస్తా - జీడిపప్పు - పండ్లను ఆహారంగా అందిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ పెరిగి కరోనాను జయిస్తూ అక్కడ రోగులు కూడా వేగంగా కోలుకుంటున్నారు.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోగులు వెంటిలేటర్ లాంటి విషమ పరిస్థితి వరకూ రాకుండానే కరోనా నుంచి క్యూర్ కావడం విశేషం. మనవాళ్ల మందులు - పౌష్టికాహారం - మనో ధైర్యానికి కరోనా కూడా సలాం కొట్టి పారిపోతుందని చెప్పవచ్చు.


Tags:    

Similar News