వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి కి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

Update: 2019-12-10 13:11 GMT
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి  అసెంబ్లీ లో  స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కోటంరెడ్డికి హైబీపీ వచ్చింది.  బీపీ రావడంతో అక్కడికి చేరుకున్న వైద్యులు పరీక్షించారు. అయితే ప్రాథమిక చికిత్స   చేసిన తరువాత .. మెరుగైన వైద్యం కోసం విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీధర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మంత్రులు ఆళ్లనాని - పేర్ని నాని - ఎమ్మెల్యే జోగి రమేష్‌ లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పరామర్శించారు.

కాగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంనుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కోటంరెడ్డి. మాజీ ఎంపీ వి . హనుమంతరావు ఆయన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. ఆ తరువాత వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా మారారు. ఆ విధేయతతోనే రెండు సార్లు టికెట్ సంపాదించారు. కాగా మొదటినుంచి దూకుడుగా వ్యవహరించే శ్రీధర్ రెడ్డి గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఓ మహిళా ప్రభుత్వం అధికారినిపై దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసు నమోదయింది.

ఇదిలా ఉంటే.. కోటంరెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు షరతులు ఉన్నా తమ పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది జగన్‌ పుణ్యమే అన్నారు. 2024లో వైసీపీ - బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని.. టీడీపీకి మూడో స్థానమేనని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News