వైసీపీ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌..వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్

Update: 2019-03-08 17:18 GMT
తెలుగు ప్రజల్ని కేసీఆర్‌ - ఆయన తనయుడు అవమానిస్తున్నారని.. అలాంటివారికి జగన్‌ వత్తాసు పలకడం దారుణం అని అన్నారు చంద్రబాబు. ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్‌ లో మాట్లాడిన ఆయన జగన్‌ - కేసీఆర్‌ దోస్తీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు అభివృద్ధి చెందడం కేసీఆర్‌ - కేటీఆర్‌ కు అస్సలు ఇష్టం లేదని.. మనకు ఐటీ కంపెనీలు -  వివిధ రకాల్లో పెట్టుబడులు వస్తుండడం చూసి ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే మన ప్రాంతంపై కూడా వాళ్ల పెత్తనం సాధించేందుకే జగన్‌ ను సామంతరాజుగా  మార్చుకున్నారని ఆరోపించారు. ఒకవేళ రేపు ఎన్నికల్లో జగన్‌ గెలిస్తే.. కేసీఆర్‌ కు సామంతరాజుగా కప్పం కడతాడని విమర్శించారు చంద్రబాబు. తెలుగు తల్లిని ఘోరంగా అవమానించిన కేసీఆర్‌ తో జగన్‌ దోస్తీ చేయడం చాలా బాధాకరం అని అన్నారు ఏపీ సీఎం.

రాష్ట్ర ప్రతిష్టం కోసం తాను నిద్రాహారాలు మాని కష్టపడుతుంటే..  దాన్ని ఎట్లా నాశనం చెయ్యాలా అని కేసీఆర్‌ అండ్‌ టీమ్‌ హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో కూర్చుని ప్లాన్లు వేస్తున్నారని అన్నారు చంద్రబాబు. మన డేటా మొత్తం వాళ్లు దొంగిలించి మనపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు సిట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్నింటికి మించి వైసీపీలో జగన్‌ ఒక కార్యకర్త మాత్రమేనని అసలు ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ అని - వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. అసలు నిజాలు మరికొన్ని రోజుల్లోనే తెలుస్తాయని అప్పుడు అందరి బండారం బయట పడుతుందని జోస్యం చెప్పారు ఆయన.
Tags:    

Similar News