ఆ మాజీ ఐఏఎస్‌ల‌కు పేదలంటే ప‌డ‌దు.. మంత్రి నారాయ‌ణ స్వామి ఫైర్‌

Update: 2022-04-19 15:22 GMT
త‌న వ్యాఖ్య‌ల‌తో నిత్యం మీడియాలో ఉండే.. చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్ 2.0లోనూ మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న కిళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి.. తాజాగా మ‌రోసారి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని విధంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి మంత్రులైనా.. నాయ‌కులైనా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌నేత‌లపై విమ‌ర్శ‌లు చేస్తారు. కానీ, తాజాగా నారాయ‌ణ స్వామి మాత్రం మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం, పీవీ ర‌మేష్‌ల‌పై త‌న మాట‌ల తూటాలు ఎక్కు పెట్టారు. జ‌గ‌నే దేవుడ‌ని భావిస్తూ.. ఆయ‌న చిత్ర‌ప‌టానికే పూజ‌లు చేసి.. మంత్రి ప‌ద‌వి స్వీక‌రించిన నారాయ‌ణ స్వామి.. మాజీ ఐఏఎస్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

చూసి నేర్చుకోండ‌య్యా!

``పేదల కోసం సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. మాజీ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారికి నచ్చడం లేదేమో..? మాజీ ఐఏఎస్ ఎస్సార్ శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలి. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ పేదలను అగర్భ శత్రువులుగా చూస్తున్నారు. వారు ఎస్సార్ శంకరన్ ను ఆదర్శంగా తీసుకోరా..? చంద్రబాబును అధికారంలోకి తేవాలనే భావనే ఎల్వీ, పీవీ రమేష్ మాటల్లో కన్పిస్తోంది. చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమ పథకాలను నిలిపేస్తారనే భావం కలుగుతోంది`` అని మంత్రి వ్యాఖ్యానించారు.

అప్ప‌ట్లో కులికారా?

పేదలకు న్యాయం చేస్తుంటే ఎల్వీ, పీవీ రమేష్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబే ఇలా  మాట్లాడిస్తున్నారని, చంద్రబాబు అప్పులు చేస్తుంటే ఎల్వీఎస్, పీవీ రమేష్ ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు.  కులుకుతున్నారా.. అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  సంక్షేమ పథకాలు వద్దని చంద్రబాబు బయటకు వచ్చి చెప్పగలరా..? చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఏం జరిగింది..? అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు పూర్తి చేశారా..? ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసి నీళ్లివ్వగలిగారా..? అని ప్ర‌శ్నించారు.

మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కున్నా మొక్కేవాడిని!

``ధర్మపోరాటం పేరుతో నల్ల చొక్కాలతో చంద్రబాబు పెట్టిన ఖర్చెంత..? నేను జగన్ కాళ్లకు నమస్కారం పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట.. ఎక్కువ అన్నం తింటే జీర్ణం కాదు. పేదలకు సీఎం జగన్ చేసే మంచి పనులు చూసి వయస్సును కూడా పట్టించుకోకుండా పాదాలకు దండం పెట్టా. నేను జగన్ కాళ్లకు మొక్కడాన్ని ఎవరైనా తప్పు పడితే.. వాళ్ల ఖర్మ. మంత్రి పదవి ఇవ్వకున్నా.. జగన్ కాళ్లకు మొక్కేవాడిని`` అని త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకున్నారు నారాయణస్వామి.

``పారిశుద్ధ్య కార్మికులకు జ‌గ‌న్ స‌ర్కారు జీతాలు పెంచితే.. కొందరు కేబినెట్‌లో అభ్యంతరం పెట్టారు.. కానీ జగన్ పట్టు పట్టి ఇచ్చారు. స్కావెంజర్స్ చేసే పని ఎవ్వరైనా చేయగలరా..? మనం చేయలేం కదా..? అని జగన్ అన్నారు. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు. నేనేం ఎగ్రెసివ్ గా మాట్లాడ్డం లేదు.. ఆవేదనతో మాట్లాడుతున్నానన్నా`` అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మ‌రి దీనిపై స‌ద‌రు ఐఏఎస్‌ల‌లో ఎల్వీ ఎలానూ మాట్లాడ‌లేదు. మ‌రి ర‌మేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News