పవన్ లోకల్ గెలుపు సూత్రం ఇదే...!
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కీలక వ్యూహాన్ని రచించనుంది.;
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ కీలక వ్యూహాన్ని రచించనుంది. దీనికి సంబంధించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కీలక దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీలుగానే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఎక్కడా ఎలాంటితేడా రావడానికి వీల్లేదని ఆయన ఉద్ఘాటించారు. ఈ విషయంలో నాయకులు కూడా అర్థం చేసుకోవాలన్నారు.
''మనం కూటమిగా ఉన్నంత వరకు విజయం మనదే'' అని చెప్పడం ద్వారా కూటమిగానే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్న లక్ష్యాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికలైనా.. పంచాయతీ ఎన్నికలైనా కూటమి మద్దతు దారులను.. కూటమి అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కొత్తగా 100 మంది వరకు నాయకులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదేసమయంలో పునర్విభజన విషయంలోనూ నాయకులు కలసి కట్టుగా వ్యవహరించాలన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో.. నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తద్వారా.. గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారాఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూసేందుకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు.
ఇక, వ్యక్తిగత అంశాల విషయంలోనూ నాయకులకు పవన్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. కుటుంబ పర మైన రాజకీయాలను తగ్గించాలని చెప్పారు. కుటుంబ సభ్యుల జోక్యాన్ని కూడా నిలువరించాలన్నారు. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల జోక్యం ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వ్యక్తిగత వివాదాలను పార్టీపై రుద్దడానికి వీల్లేదన్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో కూటమి పార్టీల గెలుపును మాత్రమే నిర్దేశించేలా నాయకులు వ్యవహరించాలని పేర్కొనడం గమనార్హం.