రూ. 5 కోట్లు.. పూరి ఇంతే సక్సెస్‌ వస్తే ఆగడు

Update: 2020-02-13 06:00 GMT
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తన పేరుకు తగ్గట్లుగానే ఫిల్మ్‌ మేకింగ్‌ విషయంలో చాలా డాషింగ్‌ గా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆమద్య వరుస ఫ్లాప్‌ లతో సతమతం అయ్యాడు. పూరి కెరీర్‌ ఖతమేనా అనుకుంటున్న సమయంలో పుంజుకున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో పూరి ఈజ్‌ బ్యాక్‌ అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా భారీ అంచనాల నడుమ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంను చాలా జోష్‌ తో పూరి రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంను పూరి.. చార్మి కలిసి నిర్మిస్తున్నట్లుగా మొదట ప్రకటన వచ్చింది. షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజులకు ఈ సినిమా నిర్మాణంలో కరణ్‌ జోహార్‌ కూడా జత కలిసినట్లుగా ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు హిందీ.. తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు పూరి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఎత్తున బడ్జెట్‌ ఖర్చు చేస్తూ తెరకెక్కిస్తున్నాడట.

ఈ చిత్రంలో కపించే ఆరు ఏడు నిమిషాల సీన్స్‌ కోసం ఏకంగా అయిదు కోట్ల రూపాయలతో ముంబయిలో సెట్‌ ను వేయిస్తున్నాడట. పది నిమిషాలు కూడా కనిపించని ఆ సీన్స్‌ కు అంత ఖర్చు అవసరమా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిట్‌ మీదున్న పూరిని ప్రస్తుతం ఎవరు ఆపలేరు. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తాడంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కరణ్‌ జోహార్‌ కూడా ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‌ లో భాగస్వామి అయ్యాడు కనుక బడ్జెట్‌ కు ఏమాత్రం వెనకాడకుండా పూరి భారీగా ఖర్చు పెడుతున్నాడు. విజయ్‌ దేవరకొండ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో ఇదే అత్యధిక బడ్జెట్‌ సినిమాగా నిలవబోతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌ విషయంలోనే కాకుండా వసూళ్ల విషయంలో కూడా అలాగే నిలుస్తుందా లేదా చూడాలి.

Tags:    

Similar News