ఎమ్మెల్యే కుర్తా నితిన్ కు..పైజామా నితీశ్ కు

Update: 2016-10-28 10:44 GMT
బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ పార్టీ అధిష్ఠానం - బీహార్ సీఎం ఇద్దరికీ బుద్ధొచ్చేలా వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఆయన తన కుర్తా, పైజామాలు రెండూ విప్పేసి వాటిని కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీకి - బీహీర్ సీఎం నితీశ్ కుమార్ కు పంపించారు.

ఎన్నిసార్లు అడిగినా తన నియోజవర్గంలో రహదార్లు వేయించడం లేదన్న ఆగ్రహంతో బీహార్ కు చెందిన ఎమ్మెల్యే  వినయ్ బిహారీ తన కుర్తాను విప్పి నితిన్ గడ్కరీకి - పైజమాను విప్పి బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు పంపించారు. వినయ్ బిహారీ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తన నియోజకవర్గంలోని మనువాపుల్ నుంచి నావల్ పుర్ రత్వాల్ వరకూ 44 కిలోమీటర్ల దూరానికి రోడ్లు వేయించాలని చాలా కాలంగా ఆయన కోరుతున్నారు. ఎన్నాళ్లైనా పనులు ప్రారంభం కాకపోవడంతో ఆగ్రహించిన ఆయన ఇలా రియాక్షన్ ఇచ్చారు.

అంతేకాదు..  కుర్తా - పైజామాలు విప్పేసి వారిద్దరికీ పంపించిన ఆయన ఇంకో నిర్ణయం కూడాతీశారు. తాను కోరిన రోడ్లు పనులు మొదలయ్యే వరకు మళ్లీ కుర్తా - పైజామాలు ధరించబోనని ప్రకటించారు. అప్పటివరకు బనియన్ - నిక్కరుతోనే తిరుగుతానని చెప్పారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనతో కుర్తా - పైజామాలు వేసుకునేలా చేస్తాయో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News