ఒకరిని మించి ఒకరు: జిల్లాలపై జగన్-బాబు కసరత్తు.. !
రాజకీయాల్లో ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలు వేయడం కామనే. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్నారన్నది వాస్తవం.
రాజకీయాల్లో ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలు వేయడం కామనే. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్నారన్నది వాస్తవం. సపోర్టర్ మేనేజ్మెంటు విషయంలో చంద్రబాబు వ్యూహాలు ఎప్పుడూ సక్సెస్ అయ్యాయి. ఆయన ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా పేరొందారు. 45 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడే అయినా.. ఆయన ఎక్కడా భేషజాలకు పోకపోవడం గమనార్హం. ఇది కొన్ని విమర్శలు తీసుకువచ్చినా.. అంతకుమించిన విజయాలను అందించింది.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఏక ఛత్రాధిపత్య రాజకీయానికి ఈ పార్టీ కేరాఫ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎవరూ చెప్పరు. ఒక్క జగనే మాట్లాడతారు. ఎవరి నిర్ణయాలు ఇక్కడ పనిచేయవు. ఒక్క జగన్ తీసుకున్న నిర్ణయమే పనిచేస్తుంది. ఇలా.. ఈ రెండు పార్టీల్లోనూ కీలకమైన తేడాలు కనిపిస్తాయి. అయితే.. ఇప్పుడు చిత్రంగా ఉన్నప్పటికీ.. ఒకరిని మించి ఒకరు జిల్లాలపై పట్టు పెంచుకునేందుకు చంద్రబాబు, జగన్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
సీమ, ఉత్తరాంధ్రలపై చంద్రబాబు పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను ఈ రెండు ప్రాంతాల్లోనే కైవసం చేసుకునేదిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గోదావరి జిల్లాలపై మిత్ర పక్షాలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఆయా జిల్లాలు సహా కోస్తా ప్రాంతంలో కంటే కూడా.. వైసీపీకి పట్టు ఎక్కువగా ఉన్న సీమ సహా.. ఉత్తరాంధ్రపైనే చంద్రబాబు ఎక్కువగా చర్చలు చేస్తున్నారు. జిల్లాల్లోనూ రాజకీయాలు నడుపుతున్నారు. పెట్టుబడుల ద్వారా ఉపాధికల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక, ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా స్పందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని రాజకీయంగా అడుగులు వేసిన జగన్.. ఇప్పుడు దీనికి భిన్నంగా ప్రతి జిల్లాను కేంద్రంగా తీసుకుని పావులు కదపాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అంతేకాదు.. జిల్లాల వారీగా నాయకులకు ఆయన టార్గెట్లు పెడుతున్నారు. తద్వారా పార్టీని టీడీపీతో పోలుస్తూ.. అంతర్గత చర్చల్లో దూకుడు పెంచాలని చెబుతున్నారు. ఎక్కడ వీక్గా ఉన్నా.. అక్కడ సరిచేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.