టీఢీపీ : అరెస్టులకూ పొలిటికల్ మైలేజ్ కూ లింకేంటి?

Update: 2022-03-24 23:30 GMT
ముందు అరెస్టు అయిపోవాలి
త‌రువాత మీడియా ముందుకు రావాలి
ఖాకీలు థ‌ర్డ్ డిగ్రీ అప్లై చేస్తే న్యాయ‌పోరాటంకు పోవాలి
ఇవ‌న్నీ చేస్తేనే జ‌నం నాయ‌కుల‌ను న‌మ్ముతారు
నాయకులు త‌మ అధినాయ‌క‌త్వాల‌ను మెప్పించ‌గ‌లుగుతారు

ఇదే సూత్రం జ‌గ‌న్ కు మ‌రియు ఇదే సూత్రం చంద్ర‌బాబుకు వ‌ర్తించడం ఖాయం ఇవాళ‌.. ఇంకా చెప్పాలంటే సానుభూతి రాజ‌కీయాల్లో అరెస్టు ఓ గెలుపు సూత్రం కూడా ! రాజ్య ధిక్కారం అంటూ  స్వ‌ప‌క్షం అరిచే అరుపుల‌కు కొన‌సాగింపు చ‌ర్య మ‌రియు చ‌ర్చ అరెస్టే ! క‌నుక టీడీపీ నాయ‌కులూ  ముందు మీరు అరెస్టై పొండి. భ‌య‌ప‌డ‌కండి.

హౌస్ అరెస్టుల‌కు కూడా భ‌య‌ప‌డ‌కండి అని చంద్ర‌బాబు గొంతెత్తి పాఠాలు చెబుతున్నదే ఇందుకు.. ఒక నాయ‌కుడి అరెస్టు కాకుండా ఉంటే ఇవాళ ఆ ఉద్య‌మాన్ని న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేరు అన్న‌ది కూడా వాస్త‌వం. పోలీసు దగ్గ‌ర పొందే అవ‌మాన‌మే రేప‌టి విజ‌యానికి నాంది.

అరెస్టుల‌యితేనే ప్ర‌జాస్వామ్యంలో ఓ విప‌క్షం బ‌లమ‌యిన గొంతుక వినిపించి, పాల‌క ప‌క్షంతో యుద్ధం చేస్తుంద‌ని అనుకోవాలి.పోలీసోడి లాఠీ దెబ్బలు తింటేనే ప్ర‌జాస్వామ్య దేశంలో  విప‌క్ష స‌భ్యుల పోరాట ప‌టిమ ఎంత‌న్న‌ది వెల్ల‌డి అవుతుంది. బాబ్లీ ప్రాజెక్టు వివాదంలో ఆ రోజు మ‌హారాష్ట్ర పోలీసుల చేతిలో టీడీపీ దెబ్బ‌లు తిని వ‌చ్చింది.

పొరుగు పోలీసుల లాఠీలు ఆ రోజు నాయ‌కుల‌పై వీపుల‌పై విరిగాయి. దాంతో సానుభూతి పెరిగింది. అదేవిధంగా మొన్న‌టి వేళ ఉపాధ్యాయ ఉద్య‌మంలో కూడా పోలీసుల అతి కార‌ణంగానే వైసీపీ స‌ర్కారు ప‌రువు పోగొట్టుకుంది. నేరుగా పాఠ‌శాల‌ల‌కు పోయి నోటీసులు అంటించి రావ‌డంతోనే ఆ అణ‌చివేత‌ను త‌ట్టుకోలేక బ‌డి పంతుళ్లంతా క‌దం తొక్కి చ‌లో విజ‌య‌వాడ‌ను విజ‌యవంతం చేశారు.

అటుపై పీఆర్సీలో కొన్ని మార్పులు కూడా వ‌చ్చాయి. వాటిలో కొన్ని అనుకూలం, కొంత ప్ర‌తికూలం ఉన్నా కూడా పోలీసుల తీరు కార‌ణంగానే ఏ ఉద్య‌మం అయినా ఏ పాల‌క ప‌క్ష విధానం అయినా ఓడ‌డ‌మో, నెగ్గుకు రావ‌డమో అన్న‌ది తేలిపోతుంది.

ఈ ద‌శలో ప్ర‌స్తుతం టీడీపీ తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది. ఏం చేసినా కూడా ప్ర‌భుత్వం అరెస్టుల‌తో బెదిరిస్తోంది అని కొంత భ‌య‌ప‌డిపోతోంది. పైకి ఆ విధంగా క‌నిపించక‌పోయినా లోప‌ల మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. అయినా కూడా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను తిప్పికొట్టేందుకు తాము  ఎన్న‌డూ సిద్ధ‌మేన‌ని త‌ప్ప‌క చెబుతోంది. ఇదే ద‌శ‌లో మ‌రో వాద‌న కూడా  వినిపిస్తోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాలంటే అరెస్టులే స‌రైన మేలు చేస్తాయ‌ని అంటోంది కూడా! ఎందుకంటే టీడీపీ నాయ‌కులు ఎవ్వ‌రు అరెస్టు అయినా కూడా వారి పొలిటిక‌ల్ మైలేజీ పెరుగుతుంద‌నే చెబుతోంది.పైకి ఆ విధంగా చెప్పినా కూడా జ‌గ‌న్ స‌ర్కారులో పోలీసుల వేధింపులు మాత్రం గ‌తం క‌న్నా తీవ్రంగానే ఉన్నాయ‌ని ప‌సుపు పార్టీతో పాటు ప్ర‌జా సంఘాలు కూడా ఒప్పుకుంటున్నాయి.

గ‌తంలో వైసీపీ విష‌య‌మై కూడా పోలీసు చ‌ర్య‌తోనే కావాల్సినంత సానుభూతి పిండుకున్నార‌న్న మాట నిరూప‌ణ అయింద‌ని కూడా టీడీపీ స్ప‌ష్టం చేస్తోంది. అంటే ప్ర‌జా పోరాటాలు అన్నీ సానుభూతి  రాజ‌కీయాల్లో భాగ‌మేన‌ని చెప్ప‌క‌నే చెబుతోంది.ఆ రోజు ఓదార్పు యాత్ర పేరిట జ‌గ‌న్ ఏ విధంగా సానుభూతి రాజ‌కీయాలు న‌డిపారో అదేవిధంగా ఇవాళ అదే స్థాయిలో అంత‌కుమించిన స్థాయిలో తాము కూడా ఆ త‌ర‌హా రాజ‌కీయాలు న‌డిపేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లో టీడీపీ నాయ‌కులు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఈ ద‌శ‌లో త‌మ అధినేత నేతృత్వంలో పాద‌యాత్ర అన్న‌ది మొద‌ల‌యితే రాష్ట్ర వ్యాప్తంగా మ‌రింత‌గా జ‌నాల్లోకి దూసుకు వెళ్లేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని కూడా భావిస్తోంది. అప్పుడు కూడా పోలీసు చ‌ర్య‌ను వైసీపీ ప్ర‌యోగిస్తే తాము సునాయాసంగా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయొచ్చు అన్న‌ది కూడా టీడీపీ వాద‌న.

అణిచివేత‌ల ఫ‌లితంగానే గ‌తంలో చాలా ప్ర‌భుత్వాలు ప‌రువు పోగొట్టుకున్నాయ‌ని జ‌గ‌న్ కూడా ఆ విధంగానే ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని టీడీపీ ప‌దే ప‌దే గగ్గోలు పెడుతోంది.క‌నుక జీరో స్థాయిలో ఉన్న పార్టీని హీరో చేసేది పోలీసు చ‌ర్యే ! అంటే అధికార పార్టీనే విప‌క్షంను మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేలా చేసేది అన్న‌ది  ఇవాళ సుస్ప‌ష్టం.
Tags:    

Similar News