బాలయ్యకు పోటీగా బరిలోకి ఆయనే..!

Update: 2019-03-14 09:26 GMT
హిందూపురంలో నటసింహం బాలకృష్ణకు పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాలయ్యపై పోటీ చేసిన నవీన్ నిశ్చల్ ఇన్నాళ్లూ అక్కడ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఈ దఫా తను హిందూపురం నుంచి నెగ్గడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఒకింత ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంది.

తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన అబ్దుల్ ఘనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇన్ చార్జి పదవిని ఆయనకే ఇచ్చారు. టికెట్ కూడా ఆయనకే ఖరారు అయినట్టుగా ప్రచారం జరిగింది. అప్పుడేమో ఉత్సాహంగా కనిపించిన ఘనీ ఆ తర్వాత మాత్రం మాట మార్చారట. తను పోటీకి దిగడానికి రెడీగా లేనట్టుగా స్పష్టం చేశారట.

తనకు ఆరోగ్యం బాగోలేదని.. తను పోటీ చేయనట్టుగా  ఆయన భీష్మించుకున్నారట. ఇంతకీ అసలు కథ ఏమిటి అంటే.. నవీన్ నిశ్చల్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదని..అందుకే ఘనీ వెనుకడుగు వేశారని వార్తలు వచ్చాయి. ఇక తుదకు వైసీపీ అభ్యర్థి అక్కడ ఖరారు అయినట్టేనని సమాచారం.

మాజీ పోలీసాఫీసర్ ఇక్బాల్ అహ్మద్ కు వైసీపీ అభ్యర్థిత్వం ఖరారు అయ్యిందని సమాచారం. అటు నవీన్ కాకుండా - ఇటు ఘనీ కాకుండా… ఇక్బాల్ ను తెర మీదకు తీసుకు వచ్చారట. అంతే కాదు.. ఇక్బాల్ కు - నవీన్ కు జగన్ రాజీ కూడా చేశారట. ఇద్దరూ కలిసి ప్రచారం చేయడానికి రెడీ అని ఈ ఇద్దరు నేతలూ ప్రకటించారట. ఈ విధంగా వైసీపీ అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చినట్టుగా సమాచారం.
Tags:    

Similar News