​​కాంగ్రెస్ ఓట‌మికి దిమ్మ‌తిరిగే కార‌ణం​

Update: 2015-11-28 05:55 GMT
వ‌రంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమేంటి..?  తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల్సింది పోయి డిపాజిట్ కూడా ద‌క్క‌కుండా ఓట‌మి పాల‌వ‌డం మ‌ర్మమేంటి?  స‌ర్వే ఘోర ప‌రాజ‌యం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అంటే కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి భిన్న‌మైన స్పంద‌న వ‌స్తోంది.

గత 17నెలల టీఆర్ ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని చెప్పుకుంటూ వరంగల్ ఉపఎన్నికలో ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం పకడ్బందీ ప్రణాళికతో ఉపఎన్నిక ప్రచారాన్ని చేపట్టింది. ప్రచారంలో లోక్‌ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ - కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్ - మాజీ కేంద్రమంత్రులు సచిన్‌ ఫైలెట్ - గులాంనబీ ఆజాద్‌ లాంటి జాతీయ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్‌ కు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యనేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇలా అతిరథులు ప్ర‌చారం చేసినప్ప‌టికీ పరువు గంగలో కలిసేలా ఫలితాలు వెలువడ్డాయ.

ఇంత ఘోరమైన రీతిలో వెలువ‌డిన ఫ‌లితాల‌ను చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం ఉపఎన్నికల ఫలితాలపై ఆరాతీస్తే దిమ్మతిరిగే సమాచారం అందినట్లు తెలిసింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ లలోని ముఖ్యనేతలే అధికార పార్టీకి అమ్ముడుపోయినట్లు అధిష్ఠానం సేకరించిన సమాచారంలో తేలింది. మరొక నియోజకవర్గంలో ఇద్దరు నాయకుల వర్గపోరుతో కనీస ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వచ్చింది. ఒక రెండు నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేయడం వల్లే ఆ నియోజకవర్గాల్లో ఓట్లశాతం తగ్గిందని అధిష్ఠాన విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీ ముందు జాతీయ పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడంతో కాంగ్రెస్‌ కు మరింత ఇబ్బందిగా తయారైంది.

ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌ ఎస్ పార్టీని రైతులు - యువకులు - ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీసినప్పటికీ ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ఊహించని మెజార్టీ రావడం వెనక బలమైన కారణాలు ఉన్నట్లు అధిష్ఠానం అనుమానిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే కేంద్ర కమిటీలో చర్చకు రానున్నట్లు తెలిసింది. త్వరలో జరుగనున్న గ్రేటర్ - వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై దీని ప్రభావం కాంగ్రెస్‌ కు మరింత నష్టం చేకూర్చే విధంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా స్వంత పార్టీ మనుషులే కాంగ్రెస్‌ కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని కొందరు నాయకులు అంగీకరిస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ జోరు..! మరోవైపు తమ అభ్యర్థి ఆకస్మిక మార్పుతో కుదేలైన కాంగ్రెస్‌ కు చెందిన కొందరు స్థానిక నేతలే నమ్మకద్రోహం చేయడం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డటైంది.
Tags:    

Similar News