కేజ్రీ మార్కు సంక్షేమం..ఎగ్జామ్ ఫీజులూ కట్టేస్తారట

Update: 2019-08-24 14:58 GMT
పాలనలోని అవినీతిని పారదోలి - నీతవంతమైన పాలనకు తెర తీస్తానంటూ రాజకీయాల్లోకి దిగిన అమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఇప్పుడు త్వరలో మరోమారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ... సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఎన్నికల ముంగిట ప్రజలను మంచి చేసుకునే క్రమంలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రకటించిన కేజ్రీ సర్కారు... ఇప్పుడు మరో సంచలన పథకాన్ని ప్రకటించేసింది. సీబీఎస్ఈ విద్యార్థులు చెల్లించాల్సిన ఎగ్జామ్ ఫీజులను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు శనివారం కేజ్రీ కేబినెట్ లోని కీలక మంత్రి మనీష్ సిసోడియా ఈ సంచలన ప్రకటనను చేశారు.

సీబీఎస్ ఈ బోర్డు... తన కరిక్యూలమ్ లో భాగంగా 11 - 12వ తరగతులకు సంబంధించిన ఫీజులను ఇటీవల భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఫీజుల పెంపు నిజంగానే దిగువ మధ్య తరగతి వర్గానికి చెందిన విద్యార్థులు భరించలేనివి గానే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీబీఎస్ ఈ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిరసనలను ఏమాత్రం పట్టించుకోని సీబీఎస్ ఈ... తన నిర్ణయంపై బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారమైనా పెంచిన ఫీజులను చెల్లించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్దమైపోయారు.

ఇలాంటి క్రమంలో ఇప్పటికే రెండు ఎన్నికల్లో క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో డిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న కేజ్రీ... త్వరలో మూడో ఎన్నికను ఎదుర్కోబోతున్నారు. తన పాలనపై ఢిల్లీ ప్రజల్లో ఏమైనా అసంతృప్తి గూడుకట్టుకున్నదేమోనన్న భయంతో కేజ్రీవాల్ ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు ప్రకటించారు. ఢిల్లీ నగరంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించిన కేజ్రీ... అంతకుముందే నగరవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టారు. తాజాగా సీబీఎస్ ఈ చదువుతున్న ఢిల్లీ పరిధిలోిన విద్యార్ధుల ఫీజులను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని కేజ్రీ సర్కారు సంచలన ప్రకటన చేసింది. ఈ పథకం... సీబీఎస్ఈ 11 - 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని కేజ్రీ సర్కారు ప్రకటించింది.

   

Tags:    

Similar News