సీఎంల భేటీలో కేసీఆర్ ఏం చెప్పారంటే...

Update: 2017-04-23 16:55 GMT
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. ఎరువుల నిమిత్తం ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఇటీవల ప్రకటించామని తెలిపారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రకటించారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ ద్వారా 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని క్రాప్‌ కాలనీలుగా మార్చాలని కేసీఆర్ కోరారు. పంట దిగుబడి పెంచేందుకు కేంద్రం వివిధ రాష్ర్టాల్లోని పరిశోధన సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. పంటలకు నాణ్యమైన విద్యుత్‌ ను తక్కువ ధరకు అందించాలని విజ్ఞప్తి చేశారు.  

ప్రభుత్వ బీమా పథకాలను సంస్కరించాలని సూచించారు. ఆహార ధాన్యం - నూనె గింజలు - టెక్స్‌ టైల్స్ దిగుమతులను సమగ్రంగా సమీక్షించాలని కేసీఆర్ కోరారు. వ్యవసాయానికి మద్దతిచ్చే డెయిరీ - గొర్రెలు - చేపల పెంపకం - పౌల్ట్రీ వంటి రంగాలను పన్నుల నుంచి మినహాయించాలని కోరారు. కాంపా నిధులు విడుదలకు అడ్డంకులను వీలైనంత త్వరగా తొలగించాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని సూచించారు.

ఇదిలాఉండ‌గా... ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమావేశం కానున్నారు. 7 రేస్‌ కోర్స్ రోడ్‌లోని ప్రధాని నివాసంలో ఉదయం 11.45 గంటలకు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా గిరిజన - బీసీ-ఈ రిజర్వేషన్ కోటా పెంపుతో పాటు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మోడీని సీఎం కోరే అవకాశం ఉన్నది. ఈ నెల 21న సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన విషయం విదితమే. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News