కమల్ హాసన్ మరో రాజకీయ భేటి

Update: 2018-09-26 10:29 GMT
కమల్ హాసన్ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.? కాంగ్రెస్, బీజేపీలు కాకుండా దేశంలో బలంగా ఉన్న పార్టీలతో జట్టు కట్టి కేంద్రంలో చక్రం తిప్పాలని యోచిస్తున్నారా.? ప్రస్తుత పరిణామాలను బట్టి ఔననే అనిపిస్తోందంటున్నారు రాజకీయ వర్గాలు..

కమల్ హాసన్ తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసి ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.పార్టీ స్థాపన తర్వాత ఆయన జాతీయ నేతలను కలుస్తూ వారితో సాన్నిహిత్యం నెరుపుతున్నారు. గతంలో కమల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్ - కొందరు ప్రతిపక్ష నేతలతో భేటి అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపై చర్చించినట్టు వార్తలొచ్చాయి.

తాజాగా చెన్నై వచ్చిన ఒడిశా సీఎంను కమల్ హాసన్ కలిశారు. ఒడిశా భవన్ లో ఉన్న సీఎం నవీన్ పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి భేటి అయ్యారు. వర్ధమాన రాజకీయాలపై మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ రాకపోతే ప్రాంతీయ పార్టీలకే కీలకంగా మారనున్నాయని.. కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు చెన్నై వర్గాలు తెలిపాయి.
Tags:    

Similar News