రాజ్య‌స‌భ సీటు కోసమే అలా చేస్తున్నారా?

Update: 2017-06-27 15:34 GMT
దేశంలో ఏం జరిగినా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్‌ జగనే కారణమనే దౌర్భాగ్య ప‌రిస్థితిని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. అమరావతికి ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చే రుణాన్ని రానివ్వకుండా వైఎస్సార్సీపీ తప్పుడు ఈమెయిల్స్ పంపుతోందంటూ  మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడటాన్ని అంబటి రాంబాబు త‌ప్పుప‌ట్టారు. గుంటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో ఈమెయిల్స్ పంపాల్సిన అవసరం తమకు లేదని - మీరు చేస్తున్న తప్పులను ధైర్యంగా ఎత్తిచూపే సత్తా వైఎస్సార్సీపీకి ఉందని అంబటి రాంబాబు యనమలకు హితవు పలికారు.  రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని  వైఎస్ జగన్ కు ఆపాదిస్తూ బురదజల్లడం టీడీపీకి అలవాటైపోయిందని అంబటి మండిపడ్డారు. ఎవరో పిటిషన్ వేసిన దానికి.... వైఎస్సార్సీపీకి ఏ సంబంధం లేకపోయినా గుడ్డ కాల్చి ముఖాన వేయడం దారుణమని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తారు.

అభివృద్ధి పేరుతో  చంద్రబాబు - లోకేష్ లు రాష్ట్రాన్ని దోచుకుతింటుంటే - మంత్రి యనమల రామకృష్ణుడు వారికి వంత పాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు దిగజారుడు రాజకీయాలు చేయడంలో సీనియర్ మోస్ట్‌ అని అంబటి ఎద్దేవా చేశారు. 2018లో రాజ్యసభ టికెట్ కోసం బాబు కటాక్షం పొందేందుకే యనమల వైఎస్సార్సీపీపై - వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బయటకు గెంటేసిన నీచమైన వ్యక్తి యనమల అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బాబు బహుమతిగా ఆర్థికమంత్రిని చేసి పక్కనకూర్చోబెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి నీతిమాలిన, దిక్కుమాలిన పని చేస్తూ వైఎస్సార్సీపీ - జగన్ ను నిందించడం మానుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేయాలే త‌ప్ప..దానిపేరుతో అక్రమంగా వేలకోట్లు దాచుకునే కార్యక్రమం చేయొద్దని అంబ‌టి హితవు పలికారు.

అమరావతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని - అభివృద్ధికి ఎప్పుడూ తాము అడ్డుకాదని అంబ‌టి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు బృందం అమెరికాలో పర్యటించినప్పుడు కూడ ఇలాగే  ప్రవర్తించారని - వైఎస్ జగనే ఈమెయిల్ పంపాడంటూ బురద జల్లారని అంబటి గుర్తు చేశారు.  కాపు ఉద్యమ  ఘటన సమయంలో రైలు దగ్ధమైతే - కడపవాళ్లే వచ్చి అగిపుల్లవేశారని కట్టుకథలు అల్లుతూ చంద్రబాబు వైఎస్ జగన్ పై నిందలు వేశాడని అంబటి ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధానిలో అరటిచెట్లు తగలబడిన సందర్భంలోనూ కడపవాసులు తగలబెట్టారని మాట్లాడారని...ఎక్కడ ఏం జరిగినా దాన్ని వైఎస్సార్సీపీ - వైఎస్ జగన్ పైకి నెట్టేయడం బాబుకు అలవాటుగా మారిందని అంబటి దుయ్యబట్టారు. మీరు అధికారంలోనే ఉన్నారు, ఏ ఒక్కదాన్నైనా నిరూపించారా బాబూ అని నిలదీశారు.

 చైనా - అమెరికా - సింగపూర్ ను తలదన్నే రీతిలో అమరావతిని నిర్మిస్తానంటూ చంద్రబాబు కలల ప్రపంచాన్ని సృష్టించాడని అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తుందని, భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కానరావడం లేదని చురక అంటించారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరగక్కపోగా...తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ లు నిర్మించి వందలు, వేల కోట్లు దోచుకున్నారని విరుచుకుపడ్డారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు మింగేస్తున్నందునే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన తాము ప్రశ్నిస్తున్నామన్నారు. బాబు అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఏమీ చేయలేదు కాబట్టే చంద్రబాబు కుట్రపూరిత  ప్రకటనలిస్తున్నార‌ని అంబటి విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News