జనసేనలో 'వారసత్వం'.. ఛాన్స్ ఉందా ..?
జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లు కూడా ఉన్నాయి.;
జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో వారసత్వ రాజకీయాలను కూడా ప్రోత్సహించకపోవడం ఒకటి. వాస్తవానికి పూర్తిస్థాయిలో 2024 లోనే జనసేన పుంజుకుంది. 2019లో పోటీ చేసినా.. అది లెక్కలోకి రాలేదు. ఎందుకంటే.. అప్పట్లో పెద్దగా ఊపు లేదు. పైగా జగన్ పాదయాత్ర ప్రభావం కూడా కనిపించింది. ఈ క్రమంలో 2024లోనే పూర్తిస్థాయిలో డిమాండ్ ఏర్పడింది.. నాయకులు కూడా పోటీ పడ్డారు.
జగ్గంపేట వంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పెద్ద ఎత్తున యాగీ కూడా చోటు చేసుకుంది. ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది చూస్తే.. పలువురు ఎమ్మెల్యేలు.. తమ తమ వారసులను రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల పోరులో తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పైకి మౌనంగా ఉన్నా.. నియోజకవర్గాల స్థాయిలో చక్రం తిప్పేలా నాయకులను రంగంలోకి దింపుతున్నారు. సంఖ్య పరంగా తక్కువగానే ఉన్నా.. ప్రచారం మాత్రం ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో నలుగురు తమ స్థానాల్లో వారి కుటుంబీకులను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక, సీనియర్లుగా ఉన్న మరికొందరు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాలను రెడీ చేసుకుంటున్నారు. తమ వారికి టికెట్లు కోరుతున్నారు. కానీ.. ఈ తరహా సంస్కృతి జనసేన లో ఉందా? అనేది డౌటే! ఎందుకంటే.. వారసత్వంగా కంటే కూడా.. ప్రజల్లో ఉన్న నాయకులకు గుర్తింపు ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇలానే కొంత మందికి ఆయన టికెట్ కూడా ఇచ్చారు. వీరిలో కాకినాడ రూరల్ నుంచి నానాజీ ఎంపిక. అదే విధంగా రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్.. వంటి వారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా పాటించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కానీ, ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు.. తమ తమ వారసులను రంగం లోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఏమేరకు వారసత్వ రాజకీయాలను పవన్ ప్రోత్సహిస్తారు? .. ఏమేరకు టికెట్లు ఇస్తారు? అనేది చూడాలి.