ఎంత దాచాలన్నా.. బాబు బయటపెట్టేస్తున్నారు.. !
ఎందుకంటే.. తామే తమ నాయకుల పనితీరుపై విమర్శలు చేస్తే.. ప్రత్యర్థులకు మరిన్ని ఆయుధాలు అందించినట్టు అవుతుందని నాయకులు భావిస్తారు.;
పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు.. నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. వంటివాటిని సహజంగానే రాజకీయ కోణంలో చూసినప్పుడు.. ఏ పార్టీ కూడా బయట పెట్టదు. సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే ధోరణితోనే వ్యవహరిస్తుంది. ఎందుకంటే.. తామే తమ నాయకుల పనితీరుపై విమర్శలు చేస్తే.. ప్రత్యర్థులకు మరిన్ని ఆయుధాలు అందించినట్టు అవుతుందని నాయకులు భావిస్తారు. అందుకే కీలక ఆరోపణలు వచ్చినప్పుడు..మౌనంగా ఉంటారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు సరిదిద్దుకోవాలని సందేశాలు.. సూచనలు చేస్తారు. ఈ తరహా పరిణామం.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. అప్పట్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలు వెలుగు చూసినప్పుడు.. పెద్ద రచ్చే అయింది. ఆయనపైచర్యలకు సొంత పార్టీ నాయకులే పట్టుబట్టారు. అయినా.. వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.పైగా సమర్థించింది. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనంతబాబు వ్యవహారంలోనూ ఇలానే చేసింది.
ఆయన తన డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్ప టికీ ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అయినా.. వైసీపీ పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఇంత పెద్ద నేరాలు.. ఘోరాలు టీడీపీ నేతల మధ్య కనిపించకపోయినా.. ప్రజలను పట్టించుకోక పోవడమే కాదు.. స్థానిక టీడీపీ నాయకులను కూడా లెక్కచేయని ఎమ్మెల్యేలు ఉన్నారనడంలో సందేహం లేదు. ఈ విషయం పార్టీకి కూడా తెలుసు. అనేక మందిపై ఆరోపణలు కూడా వచ్చాయి.
అయితే.. ఎప్పటికప్పుడు.. ఈ విషయంలో పార్టీ సదరు నాయకులను హెచ్చరస్తూనే ఉంది. పద్ధతి మార్చుకోవాలని చెబుతూనే ఉంది. అయినా.. కొందరు నాయకులు వినిపించుకోవడం లేదు. అయితే.. ఇక ఎన్నాళ్లని ఊరుకుంటాం.. ఎన్నాళ్లని మనసులోనే దాచుకుంటాం.. అనుకున్నారో ఏమో.. తాజాగా సీఎం చంద్రబాబు ఇలాంటి ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సూళ్లూరు పేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేరును ఉటంకిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగామారింది.
''ఇలాంటి వారికి ఒకటే చెబుతున్నా.. పార్టీ తరఫున మీరు గెలిచారంటే కార్యకర్తల కష్టంతోనే గెలిచారని గుర్తు పెట్టుకోవాలి. వారు లేకపోతే.. మీరు లేరు.. నేనే లేను. కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అసలు అప్పాయింట్మెంటు ఎందుకు.. ? కార్యకర్తలనుకలిసే తీరిక కూడా లేకుండా ఏం చేస్తున్నారు. ఇదే కొనసాగితే.. ఇక ఇంటికే!`` అని చంద్రబాబు హెచ్చరించారు. ఆయన నేరుగా వెలవల పేరును ప్రస్తావించినా.. రాష్ట్రంలోని అందరికీ వినిపించేలా తన మనసులో మాటను చెప్పేయడం గమనార్హం. మరి నాయకులు మారతారో లేదో చూడాలి.