'రామాయణం' స్టార్ రణబీర్ రెమ్యునరేషన్
అతడు నటిస్తున్న తాజా ఎపిక్ చిత్రం `రామాయణం` కోసం ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం.;
భారతదేశంలో అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటున్న స్టార్లలో రజనీకాంత్, ప్రభాస్, దళపతి విజయ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖాన్ల త్రయం కొన్ని వరుస ఫ్లాపులతో రేసులో వెనక్కి తగ్గడం, అదే సమయంలో సౌత్ స్టార్లు పాన్ ఇండియా హిట్లతో రేసులోకి దూసుకురావడంతో పారితోషికంలోను మన స్టార్లదే హవా.
కానీ ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ పారితోషికంలో రైజ్ అవుతున్నాడు. అతడు మునుముందు దక్షిణాది పాన్ ఇండియన్ స్టార్లకు పోటీకి మారబోతున్నాడు. అతడు నటిస్తున్న తాజా ఎపిక్ చిత్రం `రామాయణం` కోసం ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం. అయితే ఇది రామాయణం రెండు భాగాల కోసం పారితోషికం. ఒక్కో సినిమాకి 75 కోట్ల చొప్పున పారితోషికానికి అతడు సంతకం చేసాడని హిందీ ట్రేడ్ చెబుతోంది.
నితేష్ తివారీ రూపొందిస్తున్న రామాయణం ఫ్రాంఛైజీ రెండు భాగాలకు కలుపుకుని దాదాపు 1600 కోట్ల బడ్జెట్ ని వెచ్చించగా, మొదటి భాగానికి 900 కోట్లు, రెండో భాగానికి 700 కోట్లు ఖర్చు కానుంది. రెండు భాగాల పౌరాణిక ఇతిహాసం రామాయణం కోసం ప్రఖ్యాత హాలీవుడ్ టెక్నీషియన్ హాన్స్ జిమ్మెర్, ఆస్కార్ గ్రహీత ఎఆర్ రెహమాన్, విఎఫ్ఎక్స్ కంపెనీ డిఎన్ఇజి వర్క్ చేస్తుండడంతో బడ్జెట్ పరంగా ప్రాజెక్ట్ అసాధారణంగా మారింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటిస్తున్న శ్రీరాముడు పాత్రధారి రణబీర్ కపూర్ పారితోషికం అత్యంత భారీగా ఉంది. రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుండగా, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే తదితరులు నటించారు.
రామాయణం చిత్రానికి ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్ మాన్స్టర్స్ మైండ్ క్రియేషన్స్ బడ్జెట్ ని సమకూరుస్తున్నాయి. ప్రఖ్యాత స్టంట్ కోఆర్డినేటర్లు టెర్రీ నోటరీ, గై నోరిస్ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తారు. ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న VFX కంపెనీ నమిత్ మల్హోత్రాకు చెందిన DNEG మ్యానేజ్ చేస్తోంది. ప్రఖ్యాత స్వరకర్తలు హన్స్ జిమ్మెర్ - AR రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ వెబ్ లో కోట్లాది వ్యూస్తో దూసుకెళుతోంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పైనా టీజర్ ని ప్రదర్శించారు.