పంపిణీదారుల‌తో మాట్లాడిన మెగాస్టార్!

Update: 2022-05-02 00:30 GMT
క‌ష్టాలు న‌ష్టాల్లో ఆదుకుంటేనే సిస‌లైన స్టార్ గా గుర్తింపు ద‌క్కుతుంది. అంత గొప్ప వారు కాబ‌ట్టే అమితాబ్ బ‌చ్చ‌న్ - ర‌జ‌నీకాంత్- చిరంజీవి వంటి ప్ర‌ముఖులు ద‌శాబ్ధాల పాటు సూప‌ర్ స్టార్లుగా ఏలారు. ఇప్ప‌టికీ ఎదురేలేని స్టార్ డ‌మ్ ని కొన‌సాగిస్తున్నారు. క‌ష్ట న‌ష్టాల్లో త‌మ నిర్మాత‌లు పంపిణీ వ‌ర్గాల‌కు ఎప్పుడూ అండ‌గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి ఈసారి కూడా త‌న స‌హృద‌య‌త‌ను చాటుకుంటున్నార‌ని తెలిసింది.

ఇటీవ‌లే చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన ఆచార్య విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కి ఆరంభ‌మే డివైడ్ టాక్ రావ‌డంతో వ‌సూళ్ల పైనా దాని ప్ర‌భావం క‌నిపించింది. తాజా స‌మాచారం మేర‌కు.. ఆచార్య వ‌ల్ల న‌ష్టాల భారిన ప‌డ‌నున్న పంపిణీదారుల‌ను ఆదుకునేందుకు మెగాస్టార్- రామ్ చ‌ర‌ణ్‌ ముందుకు వ‌చ్చార‌ని తెలిసింది. పంపిణీ దారుల్లో ఎవ‌రైతే తీవ్ర‌ న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నారో వారికి ఒక్కొక్క‌రికి రూ.5కోట్లు చొప్పున రిట‌ర్న్ ఇచ్చేందుకు చిరు అంగీక‌రించార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇత‌రుల‌కు మాత్రం చిరు న‌టిస్తున్న `గాడ్ ఫాద‌ర్` రైట్స్ ద్వారా కాంప‌న్సేష‌న్ ఉంటుంద‌ట‌.

ఆచార్య చిత్రంలో న‌టించినందుకు చిరు-చ‌ర‌ణ్ సంయుక్తంగా 70కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. స్టార్ హీరోలు ఇద్ద‌రూ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు కాకుండా న‌ష్టాల్లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు ముందుకు రావ‌డం వారి మంచిత‌నానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఆచార్య చిత్రానికి చ‌ర‌ణ్ కూడా ఒక నిర్మాత అన్న సంగ‌తిని మ‌రువకూడ‌దు. ఒక నిర్మాత‌గా ప‌దిమంది మంచి కోరుకోవ‌డం చ‌ర‌ణ్ ప్ర‌త్యేక‌త అని నిరూప‌ణ అవుతోంది.
Tags:    

Similar News