అల ప్రమోషన్స్ ఆపని గురూజీ!

Update: 2020-01-25 08:36 GMT
ఈ సంక్రాంతి కి విడుదలైన సినిమాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' విజేతగా నిలిచింది. ఈ సినిమాకు ప్రచార కార్యక్రమాలు మూడు నెలల ముందు నుంచే ప్రారంభమయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. హీరో అల్లు అర్జున్ మాత్రమే కాదు.. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు.

త్రివిక్రమ్ గతంలో ప్రమోషన్ల కు.. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండేవారు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా ఒకటిఅరా ఇంటర్వ్యూలతో పనికానిచ్చేవారు. అయితే ఈ సారి మాత్రం ప్రమోషన్ల ను సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తోంది. సినిమా రిలీజై రెండోవారం చివరికి వస్తున్నా ప్రమోషన్స్ ఆపడం లేదు. నిన్న ఈ సినిమాలో పాటలకు సాహిత్యం అందించిన రచయితలందరితో కలిసి ఒక స్పెషల్ చాట్ షో లో పాల్గొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి(సామజవరగమన).. కృష్ణ చైతన్య(OMG డాడీ) .. కాసర్ల శ్యామ్(రాములో రాముల).. రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ).. విజయ్ కుమార్ భల్లా (సిత్తరాల సిరపడు).. కళ్యాణచక్రవర్తి(అల వైకుంఠపురములో) ఈ సినిమా కు పాటల రచయితలు.

ఈ చాట్ షోలో సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కృష్ణ చైతన్య .. కాసర్ల శ్యామ్.. రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అందరూ పాటల రచయితలు కావడంతో చర్చ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ చాట్ షో వీడియోకు యూట్యూబ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడంలో పాటలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా రచయితలను అందరినీ ఒక చోట చేర్చడం మంచి ఆలోచనే. గతం లో కంటే ఇప్పుడు పాటల రచయితలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని చెప్పవచ్చు. ఇలాంటి కార్యక్రమాలతో సినిమా కు కూడా ప్రమోషన్ లభిస్తోంది.


Tags:    

Similar News