అరెస్టుపై కోర్టును ఆశ్రయించిన డింపుల్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2023-06-08 11:00 GMT
సినీ నటి డింపుల్ హయాతి, ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసులో గత కొన్ని రోజులుగా సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందన్న వార్తలతో ఇటీవల డింపుల్ హయాతి వార్తల్లో నిలిచారు. ఆ ఘటనలో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

అసలు ఏం జరిగిందంటే... అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో  డింపుల్ హయాతికి గొడవ జరిగింది.   విధులకు ఆటంకం కలిగించే విధంగా తన కారుకు అడ్డంగా పార్కింగ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఆరోపణలతో డింపుల్ పై డీసీపీ కేసు నమోద్ చేశారు.

ఇక ఈ కేసు మలుపులు తిరుగుతూ వచ్చింది. డీసీపీ రాహుల్ హెగ్డే తనపై  తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ హీరోయిన్ డింపుల్ హయాతి కూడా కేసు పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె కేసును తీసుకోలేదు.  ఈ విషయంలో డింపుల్ తప్పు ఏం లేదని, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హీరోయిన్ లాయర్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.  

అయితే పోలీసులు తనను అరెస్టు చేయకుండా  స్టే ఇవ్వాలని డింపుల్ హయాతి తెలంగాణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

డింపుల్ కు  సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు వివరించారు. సీఆర్పీసీ 41ఏ నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ నోటీసులకు అనుగుణంగానే డింపుల్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.  ఈ కేసులో నిందితుడిగా ఉన్న లాయర్ విక్టర్ డేవిడ్ కు కూడా 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందుకున్న వారు చట్టాని అనుసరించి విచారణకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Similar News