వెంక‌య్య భావోద్వేగానికి గుర‌య్యారే!

Update: 2017-07-18 10:15 GMT
ముప్ప‌వ‌ర‌పుప వెంకయ్య‌నాయుడు... నిన్న‌టిదాకా బీజేపీలో సీనియ‌ర్ నేత‌. బీజేపీ అగ్ర‌నేత‌లు ఎల్కే అద్వానీ - అట‌ల్ బిహారీ వాజ్‌ పేయి పోస్టర్లు అంటించిన బాలుడి స్థాయి నుంచి వారి స‌ర‌స‌న కూర్చునే స్థాయికి చేరుకున్న అప‌ర రాజ‌కీయ చాణ‌క్యుడిగానే అంద‌రికీ తెలుసు. అయితే ఇక‌పై ఆయ‌న బీజేపీ నేత‌గా మ‌న‌కు క‌నిపించ‌బోరు. ఎందుకంటే... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌లో త‌న అభ్య‌ర్థిగా వెంక‌య్య‌నాయుడిని దింపేసింది. రాజ్యాంగ ప‌ద‌వులపై త‌నకు అంత‌గా ఇష్టం లేద‌ని, ఇంకా క్రియాశీల రాజ‌కీయాల్లోనే తాను కొన‌సాగాల‌నుకుంటున్నాను అంటే వెంక‌య్య ఎంత‌గా మొత్తుకున్నా విన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... వెంకయ్య‌ను ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేశారు. పార్టీ అధిష్ఠానం దిశానిర్దేశాల‌ను ఏనాడూ కాద‌న‌ని వెంక‌య్య చేసేదేమీ లేక ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు స‌రేన‌న్నారు.

ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేయాలంటే క్రియాశీల రాజ‌కీయాల‌తో సంబంధం ఉండ‌కూడ‌దు క‌దా. అందుకే.. పార్టీ అభ్య‌ర్థిగా త‌న‌ను ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే వెంక‌య్య‌నాయుడు త‌న కేంద్ర మంత్రి ప‌ద‌వితో పాటు పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. కాసేప‌టి క్రితం ఆయ‌న ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్డీఏ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - ఇత‌ర పార్టీ నేత‌లు వెంట రాగా... నామినేష‌న్ దాఖ‌లు చేసిన వెంక‌య్య అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ పార్టీతో త‌న‌కున్న బంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. బీజేపీని త‌న త‌ల్లితో స‌మానంగా అభివ‌ర్ణించిన వెంక‌య్య‌... త‌న ఎదుగుద‌ల‌కు పార్టీనే కార‌ణ‌మ‌ని చెప్పారు. ఏడాదిన్నర వయస్సులోనే తాను త‌న క‌న్న‌త‌ల్లిని పోగొట్టుకున్నాన‌ని, అయితే బీజేపీ త‌న‌ను త‌న సొంత బిడ్డ‌గా ఇంత వాడిని చేసింద‌ని వెంక‌య్య వ్యాఖ్యానించారు.

పార్టీని వీడుతున్నప్పుడు తాను భావోద్వేగానికి లోనయ్యానని, బాధగా ఉన్నప్పటికీ.. బీజేపీ ఇక నా పార్టీ కాదని చెబుతున్నానని, ఈ రోజు నుంచి తన పాత్ర మారుతోందని ఆయ‌న చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా తల్లిగా భావిస్తూ వచ్చిన బీజేపీ, ఇక తన పార్టీ కాదన్నారు. బీజేపీని వదిలినందుకు బాధగా ఉన్నప్పటికీ, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఎత్తుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. త‌న‌కు ఘనమైన చరిత్ర ఏమీ లేదన్నారు. తనను ఇంతవాడిని చేసింది పార్టీయేన‌న్నారు. తాను ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతను అంగీకరించలేదన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు.

ఇష్టపూర్వకంగానే బాధ్యతలు స్వీకరిస్తున్నానని వెంక‌య్య‌ చెప్పారు. రాజ్యాంగ నియమ, నిబంధనలు, ఆదర్శాలకు లోబడి పని చేస్తానని చెప్పారు. ఇకపై పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడే అవకాశం తనకు లేదని చెప్పారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పెద్దల సభ గౌరవం మరింత పెరిగేలా పని చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర వయస్సులోనే తాను తల్లిని కోల్పోయానని, తల్లిలాంటి పార్టీ తనను ఇంతవాడిని చేసిందని చెప్పారు. తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని చెప్పారు. తాను ఈ పదవికి ఎంపికైతే, పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని చెప్పారు. గతంలో ఉప రాష్ట్రపతులుగా పని చేసిన వారి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు.
Tags:    

Similar News