ఎన్టీఆర్ నాటి ముచ్చ‌ట చెప్పిన వెంక‌య్య‌?

Update: 2019-01-28 07:54 GMT
రాజ‌కీయ నేత‌లుగా ఉన్న వారు అత్యుత్త‌మ రాజ్యాంగ ప‌ద‌వుల్ని చేప‌ట్టినా.. పాత వాస‌న‌లు వారిని వ‌దిలి వెళ్ల‌వు. ఉప రాష్ట్రప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వెంక‌య్య‌నాయుడ్ని చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతూ ఉంటుంది. ఇంగువ క‌ట్టిన వ‌స్త్రం మాదిరి.. వెంక‌య్య ఏ ప‌ద‌విని చేప‌ట్టినా ఆయ‌న‌లోని రాజ‌కీయ నాయ‌కుడి వాస‌న‌లు ఒక‌ప‌ట్టాన విడిచిపెట్ట‌వు. త‌న మాట‌లు.. చేత‌ల‌తో వెంక‌య్య ఒక విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేస్తుంటారు.

పేరుకు ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలో ఉన్నారే కానీ. ఒక కేంద్ర‌మంత్రి.. ఒక పార్టీ అధినేత‌కు ఉండే చురుకుద‌నం.. ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న ఆయ‌నలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆయ‌న‌లో హుషారు ఏ మాత్రం త‌గ్గ‌క‌ముందే చేతులు.. కాళ్లు క‌ట్టేసి ఉంచే ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విని మోడీ సాబ్ క‌ట్ట‌బెట్టారు. అయిన‌ప్ప‌టికీ వెంక‌య్య‌.. త‌న ప‌రిధులు.. ప‌రిమితులు మీర‌కుండానే వీలైనంత క్రియాశీల‌కంగా.. చైత‌న్య‌వంతంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉంటున్నారు.

కొంద‌రి వాద‌న ప్ర‌కారం ఉప‌రాష్ట్రప‌తి హోదాలో ఉండి.. ఇన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న రికార్డు వెంక‌య్య‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని.. స‌మీప భ‌విష్య‌త్తులో ఆ రికార్డును బ్రేక్ చేయ‌టం సాధ్యం కాద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలోని తెలుగు సంఘం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న ఎన్టీఆర్ హ‌యాంలో జ‌రిగిన ఒక ఉదంతాన్ని ఆయ‌న చెప్పారు. తాను ఒక‌సారి ఎన్టీఆర్ ను క‌ల‌వ‌టానికి వెళ్లాన‌ని.. అక్క‌డ కొంత‌మంది ఆడ‌ప‌డుచులు ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేస్తున్నార‌ని.. అది మంచిది కాద‌ని తాను చెప్పిన‌ట్లు చెప్పారు. అయితే.. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. అది వాళ్ల ప్రేమ అని చెప్పార‌ని.. కానీ ఆర్నెల్లు తిరిగేస‌రికి వాళ్లే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన‌ట్లు చెప్పారు.

వెంక‌య్య మాట‌లు నిజ‌మేన‌ని న‌మ్మినా.. ఒక్క విష‌యం మాత్రం ఎక్క‌డో తేడా కొట్టిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. అదేమంటే.. ఎన్టీఆర్ కు స‌ల‌హాలు ఇచ్చే ప‌రిస్థితి ఎవ‌రికీ ఉందంటారు. ఆ మాట‌కు వ‌స్తే అంతవ‌ర‌కు వ‌చ్చే చ‌నువు ఇవ్వ‌న‌ని చెబుతారు. అలాంటిది అప్ప‌ట్లో వెంక‌య్య మాష్టారి స్థాయి ఏమిటి?  ఆయ‌న ఎన్టీఆర్ కు సూచ‌న చేసే ప‌రిస్థితి ఉందా? అన్న‌ది ప్ర‌శ్నే. మ‌రి.. ఇలా ఎందుకు చెప్పిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే..ఇదే స‌మావేశంలో ఆయ‌న చెప్పిన మ‌రో మాట‌ను ప్ర‌స్తావించ‌టం ద్వారా ఆయ‌నేం చెప్పాల‌నుకున్నారో అర్థం కాక మాన‌దు.

ఇంత‌కీ.. వెంక‌య్య చెప్పిన మ‌రో ఆణిముత్యం లాంటి మాటేమిటంటే.. క‌ష్ట‌ప‌డితే ఎవ‌రూ న‌ష్ట‌పోరు. నేను క‌ష్ట‌ప‌డే ఇంత‌వ‌ర‌కు వ‌చ్చాను అంటూ సెల‌విచ్చారు. అర్థ‌మైందా వెంక‌య్య మాట‌ల మ‌ర్మం..?
Tags:    

Similar News