చెన్నైకి షాక్ : శాంసన్ సిక్సర్ల మోత..రాజస్థాన్ బోణీ

Update: 2020-09-23 04:15 GMT
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం సృష్టించింది. మొదటి మ్యాచ్ గెలిచి జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ కు కళ్లెం వేసి బోణీ కొట్టింది. రాజస్థాన్ ఊహించని విధంగా భారీ స్కోర్ సాధించడంతో ఛేదన చెన్నైకి కష్ట సాధ్యంగా మారింది. టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా..   రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (32 బంతుల్లో 74; 1 ఫోర్, 9 సిక్స్‌లు) సిక్సర్ల మోత మోగించగా.. స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 69; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)  కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యఛేదనలో  చెన్నై 20 ఓవర్లకు 6 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమి మూటగట్టుకుంది.  డుప్లెసిస్ (37 బంతుల్లో 72; 1 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.  వాట్సన్(33) పరుగులు చేశాడు.  చివర్లో ధోని(29) మెరుపులు మెరిపించినా లక్ష్యం పెద్దదవడంతో విజయం వరకూ  చేరలేకపోయారు. రాయల్స్ బౌలర్ రాహుల్ ట్వేటియా 3 వికెట్లు తీశాడు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ దక్కించుకున్నాడు.

తొలిసారి సంజూ భారీ హిట్టింగ్

శాంసన్ గతంలో  ఎన్నో సూపర్ ఇన్నింగ్స్ ఆడినా..ఈ మ్యాచ్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుంది.సంజూ 19 బంతులకే అర్ధ సెంచరీ చేశాడు. మ్యాచ్ మొత్తం మీద 9 సిక్సర్లు బాదాడు. టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్న సంజూకి ఈ ఇన్నింగ్స్ ఎంతో మేలు చేసేదే. సంజూ శాంసన్ ఉత్తమ వికెట్ కీపరే, బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు..ఇండియాలోనే ఉత్తమ యువ బ్యాట్స్ మెన్ దీనిపై చర్చకు సిద్ధమా అంటూ ట్వీట్ చేశాడు.

-ఏడాది నిషేధం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చి పరుగుల వరద పారించిన స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బోణీ అందించాడు

-ఇక ఆర్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. స్మిత్, శాంసన్ ఔట్ అయిన తర్వాత స్కోర్ బోర్డు మందగించగా.. ఆఖరి ఓవర్ లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి జట్టుకు భారీ అందించడంలో సాయపడ్డాడు.

-చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగింది. గెలిచిన రాయల్స్ బ్యాట్స్ మెన్ 17 సిక్సర్లు కొట్టగా, ఓడిన సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ 16 సిక్సర్లు కొట్టి ప్రేక్షకులకు అసలైన టీ 20 మజా ఇచ్చారు. ఈ మ్యాచ్ లో మొత్తం 33 సిక్సర్లు నమోదయ్యాయి.

చెన్నై ఓటమికి కారణాలు

ఫామ్ లో ఉన్న రాయుడు దూరం కావడం ఓ దెబ్బ వేయగా..అతడి స్థానంలో భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన రుతు రాజ్ గైక్వాడ్ ఫస్ట్ బాల్ కే గోల్డెన్  డకౌట్ అయ్యాడు.

-మ్యాచ్ లో చెన్నై స్పిన్నర్లు తేలిపోయారు. రాజస్థాన్ స్పిన్నర్లు 75 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, చెన్నై స్పిన్నర్లు  మాత్రం 95 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు.

- రైనా స్థానంలో జట్టులో  చోటు దక్కించుకున్న మురళీ విజయ్ మొదటి మ్యాచ్ లాగానే.. ఈ మ్యాచ్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

- పియూష్ చావ్లా ఒకే ఓవర్లో 28 పరుగులు ఇవ్వడం, లుంగీ ఎంగీడి వేసిన ఆఖరి ఓవర్లో 2 నో బాల్స్ వేసి 30 పరుగులు ఇవ్వడంతో చెన్నై ని బాగా దెబ్బ వేసింది.

-మొత్తంగా ఈ మ్యాచ్ లో 416 పరుగులు నమోదై ప్రేక్షకులకు మాత్రం వినోదాన్ని పంచింది.

యశస్వి జైశ్వాల్ అరంగేట్రం.. ధోనీ ఆశీర్వాదం

 చెన్నై తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తరఫున అండర్ 19 ఆటగాడు. యశస్వి జైశ్వాల్ ఐపీ ఎల్ ల్లో అరంగేట్రం చేశాడు. ఈ  లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కేవలం ఒక  బౌండరీతో కేవలం 6 పరుగులే చేసి నిరాశ పరిచాడు. అంతకుముందు జైస్వాల్‌ సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశీర్వాదం తీసుకున్నాడు. టాస్‌ కి వెళ్తున్న ధోనికి ఎదురెళ్ళి నమస్కరించి మహీ ఆశీస్సులకు తీసుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News