రైతుల పాదయాత్ర: అప్పుడు అమరావతి కోసం.. ఇప్పుడు జగన్ కోసం!
చిత్రంగా అనిపించినా.. నిజమే. ఏపీ రాజధాని అమరావతికి తమ కన్నబిడ్డల్లాంటి.. భూములను ఎకరాల కొద్దీ ధారపోసి.. త్యాగానికి చిరునామాగా మారిన రాజధాని రైతులు.. మరోసారి పాదయాత్ర చేపట్టారు.;
చిత్రంగా అనిపించినా.. నిజమే. ఏపీ రాజధాని అమరావతికి తమ కన్నబిడ్డల్లాంటి.. భూములను ఎకరాల కొద్దీ ధారపోసి.. త్యాగానికి చిరునామాగా మారిన రాజధాని రైతులు.. మరోసారి పాదయాత్ర చేపట్టారు. అయితే.. ఇది గతంలో చేపట్టిన భారీ యాత్రకాదు. కేవలం 22-25 కిలో మీటర్ల లోపే. ముఖ్యంగా రాజధాని మహిళలు ఎర్రటి చీరలు ధరించి.. చేతిలో సారెతో విజయవాడ లోని కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వచ్చారు. రాజధానిలో శంకు స్థాపన జరిగిన ప్రాంతంలో ప్రారంభమైన పాదయాత్ర అత్యంత జోరుగా ముందుకు సాగింది.
అయితే.. గతంలోనూ `న్యాయస్థానం నుంచి దేవస్థానం` నినాదంతో పాదయాత్ర చేశారు. అమరావతి నుంచి తిరుపతి వరకు పెద్ద ఎత్తున రైతులు పాదయాత్ర నిర్వహించారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. ఈ యాత్ర సాగింది. అంతేకాదు.. అమరావతికి మంచి రోజులు రావాలని.. రాజధానిని పరిరక్షించాలని కోరుతూ.. నాడు యాత్ర చేశారు. కానీ.. ఆ యాత్రపై కూడా వైసీపీ నాయకులు(ఒకరిద్దరు తప్ప.) ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు. పోలీసులతో అనేక ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు.
ఇలా.. అప్పట్లో అమరావతి పరిరక్షణ కోసం.. రైతులు పాదయాత్ర చేయగా.. తాజాగా మాత్రం మరో కీలక నిర్ణయంతో రాజధాని రైతులు పాదయాత్రగా బెజవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ అధినేత జగన్ తాజాగా చేసిన మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో పాటు..`జగన్కు మంచి బుద్ధి.. మంచి ఆలోచన.. మంచి నడవడిక` ప్రసాదించాలని కోరుతూ.. రైతులు ఈ యాత్ర చేపట్టడం విశేషం. ఆయన ఆలోచనను బాగు చేయాలని..ఆయనకు రాజధానిపై సానుకూల దృక్ఫథం కలిగించేలా ఆశీస్సులు అందించాలని కోరుతూ తాము ఈ పాదయాత్ర చేస్తున్నట్టు పలువురు మహిళలు తెలిపారు.
చట్టబద్దతకు కూడా..
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న క్రమంలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదం పొందిన నేపథ్యంలో అమ్మ వారికి సారెలు సమర్పించేందుకు కూడా ఈ యాత్ర నిర్వహించినట్టు మహిళలు తెలిపారు. దాదాపు 200 మందికి పైగా మహిళ లు..(వీరిలో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు.) పాదయాత్రలో పాల్గొన్నారు. వీరంతా పసుపు, కుంకుమ, చీరె, రవికలు పట్టుకుని.. ఎంతో ఆనందంతో గుంటూరు నుంచి తుళ్లూరు, విజయవాడ ప్రకాశం బ్యారేజ్మీదుగా.. అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.