మోడీ నోట జమిలి ఎన్నికల మాట..

దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోందా అన్న చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు అన్నవి బీజేపీ నినాదం.;

Update: 2026-04-06 23:30 GMT

దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోందా అన్న చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు అన్నవి బీజేపీ నినాదం. ఆ మాటకు వస్తే ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇలా అన్నీ ఒక్కటే ఉండాలన్నది బీజేపీ మార్క్ ఫిలాసఫీ.. 2014లో బీజేపీ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి జమిలి ఎన్నికల రాగం ఆలపిస్తూనే ఉంది. 2019లో అనుకున్నా సాధ్యపడలేదు, 2024లోనూ కుదరలేదు, ఇప్పుడు 2029 ఎన్నికలు ఉన్నాయి. సమయం చూస్తే మూడేళ్ళకు పై దాటి ఉంది. దాంతో బీజేపీ నాయకత్వంలో జమిలి ఆశలు కొత్తగా చిగురు వేస్తున్నాయని అంటున్నారు.

రంగం సిద్ధం :

ఇదిలా ఉంటే బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అగ్ర నాయకుడు, ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఇచ్చిన వీడియో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ భవిష్యత్ అజెండాను ప్రస్తావిస్తూ ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం - ఒకే ఎన్నిక ( వంటి అంశాలపై దేశంలో ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని మోడీ చెప్పడం విశేషం. ఇది జాతీయ సమైక్యత పట్ల సమర్థవంతమైన పాలన పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలకు బీజేపీ ఆసక్తిగా ఉందా అన్నది అంతా చర్చించుకుంటున్నారు. 2029 ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి 2029 ఎన్నికల్లో యాంటీ ఇంకెంబెన్సీ అధికంగా ఉంటుంది అన్నది తెలిసిందే. దానిని అధిగమించేందుకు జమిలి మంత్రం జపించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఎటూ మహిళా రిజర్వేషన్ల రూపంలో మూడవ వంతు సీట్లు వారికి ఇస్తారు అలా కొత్త రాజకీయానికి తెర లేపుతారు. అలాగే అదనంగా సీట్ల పెరుగుదల చిన్న నియోజకవర్గాల నుంచి గరిష్ట లాభాన్ని బీజేపీ కోరుకుంటోంది. ఇపుడు జమిలి ఎన్నికలు కూడా తోడు అయితే పక్కాగా అనుకున్న అధికార లక్ష్యాన్ని చేరుకోగమన్న ధీమా అయితే బీజేపీలో ఉందని అంటున్నారు.

మహిళలకు చాన్స్ :

అదే విధంగా దేశంలో మహిళా రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీని బీజేపీ నెరవేర్చిందని మోడీ గుర్తు చేశారు. 2029 ఎన్నికలు నారీ శక్తి వందన్ అధినియం ప్రకారం జరిగేలా చూడటానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మోడీ చెప్పుకొచ్చారు. బీజేపీ సుపరిపాలనకు పేరుగా నిలిచింది అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయమైన అంత్యోదయ స్ఫూర్తితో పనిచేస్తూ దేశంలోని 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.

దేశమే ఫస్ట్ :

బీజేపీ భారత్ లో కీలకమైన పాత్ర పోషిస్తోందని మోడీ ప్రకటించారు. భారతీయ రాజకీయాల్లో దేశమే ప్రథమం అనే కొత్త సూత్రాన్ని బీజేపీ నెలకొల్పిందని ఆయన అన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్‌ముఖ్, కుషాభావ్ ఠాక్రే, అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ లాల్ కృష్ణ అద్వానీ మురళీ మనోహర్ జోషి వంటి బీజేపీ వ్యవస్థాపకులను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించిన పార్టీ కార్యకర్తల సేవలను కూడా ఆయన కొనియాడారు. ఈ రోజున బీజేపీకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో లక్షలాది మంది కార్యకర్తలు చేసిన కఠోర శ్రమ, క్రమశిక్షణ, త్యాగం పట్టుదల గొప్పవని అన్నారు.

Tags:    

Similar News