2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి ``ఆన్‌లైన్ ఏజెంట్లు`` ప‌నిచేస్తారా?

Update: 2022-02-09 02:30 GMT
ఏ పార్టీకైనా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప‌నిచేసే కేడ‌ర్ ఎంత ముఖ్య‌మో.. డిజిట‌ల్ మాధ్య‌మంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని, యువ‌త‌ను ఆక‌ట్టుకునే కేడ‌ర్ కూడా అంతే ముఖ్యం. ఈ విష‌యంలో ఒక‌ప్పుడు.. టీడీపీ జోరు ఎక్కువ‌గా ఉంది. చంద్ర‌బాబును , పార్టీని హైలెట్ చేసే విష‌యంలో సోష‌ల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసేందుకు కేడ‌ర్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. త‌ర్వాత‌.. అనూహ్యంగా వైసీపీ వైపు కూడా ఇదే త‌ర‌హాలో కేడ‌ర్ క‌ష్ట‌ప‌డింది. 2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ పై అభిమానంతో కాంగ్రెస్‌పై క‌సితో కేడ‌ర్ అంతా.. వైఎస్ జ‌గ‌న్‌కు అనుకూలంగా ప‌నిచేసింది. ఎంత‌లా ప‌నిచేసిందంటే.. జ‌గ‌న్‌పై క‌నీసం ఈగ కూడా వాల‌కుండా చూసుకుంది.

ముఖ్యంగా టీడీపీని, చంద్ర‌బాబును, ఆయ‌న కుమారుడు లోకేష్‌ను కూడా వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం కార్య‌క‌ర్త‌లు, ఆన్‌లైన్‌లో బాగానే ఆడేసుకున్నారు. టీడీపీ సోష‌ల్ మీడియా నుంచి ఎలాంటి పోస్టు వ‌చ్చినా.. దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ కార్య‌క‌ర్త‌లు, కేడ‌ర్ రివ‌ర్స్ కౌంట‌ర్లు ఇచ్చారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. త‌మ‌కు ఏదైనా చేస్తార‌ని.. త‌మ జీవితాలు మారుతాయ‌ని.. భావించిన క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్‌.. ఒళ్లు వంచి ప‌నిచేసింది. అంతేకాదు.. జ‌గ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఆయ‌న ఎక్క‌డ‌కు వ‌స్తున్నా.. సొంత ఖ‌ర్చుల‌తో అక్క‌డ‌కు వెళ్లి.. స‌భ‌ల్లో పాల్గొని జేజేలు కొట్టింది.

ఇక‌, జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసిన‌ప్పుడు.. అయితే.. రోజుల త‌ర‌బ‌డి.. వారాల త‌ర‌బ‌డి కూడా కేడ‌ర్ ఆయ‌న కోసం ప‌నిచేసిం దంటే.. అతిశ‌యోక్తి కాదు. జ‌గ‌న్ రేపు చేయ‌నున్న పాద‌యాత్ర స్థ‌లానికి ముందుగానే చేరుకుని అక్క‌డి ప‌రిస్థితులు.. ప్ర‌జ‌ల‌ను సానుకూలం చేయ‌డం.. జ‌గ‌న్ పాద‌యాత్రకు సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను పంచ‌డం.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం.. ఇలా.. అనేక కోణాల్లో శ‌క్తి వంచ‌న లేకుండా కేడ‌ర్ ప‌నిచేసింది. జ‌గ‌న్ అవ‌స‌రం కూడా వివ‌రించింది. రావాలి.. జ‌గ‌న్‌-కావాలి.. జ‌గ‌న్ నినాదాన్ని కేడ‌రే సృష్టించిందంటే.. అతిశ‌యోక్తికాదు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ మెరుపులాంటి మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చారు.

బ‌ల‌మైన చంద్ర‌బాబును సైతం గ‌ద్దెదింపారు. టీడీపీకంచుకోట‌ల‌ను సైతం బ‌దాబ‌దలు చేశారు. దీనికి కార‌ణం.. సోష‌ల్ మీడియా లోను.. క్షేత్ర‌స్థాయిలోనూ వైసీపీ కేడ‌ర్ వెయ్యి ఏనుగుల‌ను త‌ల‌పించే బ‌లంతో ప‌నిచేయ‌డంవ‌ల్లే అని అంద‌రూ ఒప్పుకొనే మాట‌.  క‌ట్ చేస్తే.. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి.. మూడేళ్లు అవుతోంది. మ‌రి త‌న‌పై ఆశ‌లు పెట్టుకున్న‌... త‌న కోసం.. అన్ని వ‌దులుకుని ప‌నిచేసిన కేడ‌ర్‌కు సీఎం జ‌గ‌న్ ఏం చేశారు?  వారిని క‌నీసం ఆదుకున్నారా?  ``నా గెలుపు కోసం ప‌నిచేయండి.. మీ జీవితాలు మారుస్తా`` అంటూ.. ఎన్నిక‌ల‌కు ముందు చేసిన వాగ్దానం.. ఏమైంది?  ఇదీ.. ఇప్పుడు కేడ‌ర్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న మాట‌.

ఎందుకంటే.. క‌నీసం క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్‌ను ప‌ట్టించుకునే నాథుడు వైసీపీలో క‌నిపించ‌డం లేదు. ఎమ్మెల్యేల నుంచి క్షేత్ర‌స్థాయిలో ఎవ‌రూ కూడా కేడ‌ర్ మొహం చూడ‌డం లేదు. అంతా వ‌లంటీర్ల‌తోనే ప‌నిచేయించుకుంటున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలైనా..పార్టీ కార్య‌క్ర‌మాలైనా.. అన్నింటినీ వారి చేతుల మీదుగానే చేయిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అయితే. .కేడ‌ర్‌ను ప‌ట్టించుకునే వారు కాదు క‌దా.. వారి పేరు త‌లుచుకునే వారు కూడా లేకుండా పోయారు. స‌రే.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిపోయింది. మ‌రి రేపు ఎన్నిక‌లు వ‌స్తాయి. అప్పుడు ప‌రిస్థితి ఏంటి? ఈ కేడ‌ర్ అవ‌స‌రం లేదా?  ముఖ్యంగా ఆన్‌లైన్ ప్ర‌చారం ఎవ‌రు చేస్తారు? ఇదీ.. ఇప్పుడు కేడ‌ర్ సంధిస్తున్న ప్ర‌శ్న‌.

ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల స‌ర్వే చేయించిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ కూడా గుర్తించాడు. దీనిని పార్టీ అధిష్టానానికి కూడా చెప్పార‌ని తెలిసింది. ``కేడ‌ర్‌ను ఇప్ప‌టికైనా ప‌ట్టించుకోండివారు పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. మీరు అధికారంలోకి వ‌చ్చేందుకు వారే ప్ర‌ధాన కార‌ణం`` అని చెప్పార‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌మాత్రం కేడ‌ర్‌పై అస్స‌లు దృష్టి కూడా పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం అటు ఎమ్మెల్యేలు.. ఇటు అధినాయ‌కుడు కూడా త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కేడ‌ర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో ఎన్నిక‌ల నాటికి వీరు రెబ‌ల్‌గా మారితే పెను ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని.. నాయ‌కులు అంచ‌నా వేసుకుంటున్నారు. ఈక్ర‌మంలో వీరిని ఎలా బుజ్జ‌గించాల‌నే అంశంపై నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News