జగన్ టూర్...కొత్త టెన్షన్
ఏపీలో మరోసారి జగన్ టూర్ ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.;
ఏపీలో మరోసారి జగన్ టూర్ ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తరువాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అయితే ఈ టూర్ విషయంలో పోలీసుల ఆంక్షలను వైసీపీ వారు పాటించలేదని విమర్శలు వచ్చాయి. తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి నివాసానికి జగన్ వాహనం రావడానికి కేవలం నలభై నిముషాల వ్యవధి మాత్రమే పడుతుందని కానీ అయిదారు గంటల పాటు ర్యాలీగా జగన్ వచ్చారని విమర్శలు ఉన్నాయి. దాంతో ట్రాఫిక్ హెవీగా మారి రాకపోకలు చేసేవారు జాతీయ రహదారి మీద వెళ్ళి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అంటున్నారు.
ముందస్తు నోటీసులతో :
దాంతో ఈసారి ముందస్తు నోటీసులను జగన్ కి విజయవాడ పోలీసులు జారీ చేశారు. జగన్ విజయవాడలోని ఇబ్రహీంపట్నం లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి రానున్నారు. ఆయన ఇంటి మీద జరిగిన దాడి నేపధ్యంలో పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు. దాంతో పోలీసులు జగన్ రూట్ మ్యాప్ ని డిసైడ్ చేశారు. జగన్ పర్యటన మీద ఆంక్షలు కూడా పెట్టారు.
ఇదే రూట్ మ్యాప్ :
జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి కనక దుర్గమ్మ వారధి మీదుగా కనకదుర్గ ఫ్లై ఓవర్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళేందుకు వైసీపీ రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంది. ఇదే విజయవాడ పోలీసులకు కూడా ఇచ్చింది. అయితే ఈ రూట్ మ్యాప్ ని చూసిన పోలీసులు విజయవాడలో భారీ ట్రాఫిక్ దృష్ట్యా వెస్ట్ బైపాస్ మీదుగా జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళాలని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు.
ఏం జరగనుంది :
ఇదిలా ఉంటే చివరి నిముషంలో జగన్ రూట్ ని మార్చుకోవాలని పోలీసులు సూచించారని అయితే ఇప్పటికిపుడు అది అయ్యే పని కాదని వైసీపీలో చర్చ అయితే సాగుతోంది. దాంతో జగన్ ఏ విధంగా రానున్నారు, పోలీసు ఆంక్షలను పాటిస్తూ ఆయన వెస్ట్ బైపాస్ గుండా సాగుతారా లేక వైసీపీ రూట్ మ్యాప్ నే ఫాలో అవుతూ పోలీసుల ఆంక్షలను పక్కన పెడతారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇక గుంటూరు టూర్ లో కూడా జగన్ రాక సందర్భంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పనిలో పోలీసులు శ్రమ పడ్డారు అని అంటున్నారు. మరి విజయవాడలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి జగన్ రాక నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా కఠినంగా వ్యవహరిస్తారు అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా జగన్ సైతం ఏ విధంగా వ్యవహరిస్తారు వైసీపీ ఏ రకంగా దూకుడు చూపిస్తుంది అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనా విజయవాడలో కొత్త టెన్షన్ గా మారనుందా అన్నదే హాట్ హాట్ డిస్కషన్.