మోత్కుపల్లి శంఖారావం.. ఎన్నికల బరిలోకి..

Update: 2018-09-26 09:23 GMT
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరొందిన మోత్కుపల్లి ఎట్టకేలకు తాను ముందస్తు ఎన్నికల బరిలో నిలువనున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు గవర్నర్ పదవి ఇస్తానని మోసం చేశాడని మోత్కుపల్లి గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.. బాబు వైఖరి నచ్చక దుమ్మెత్తి పోసి ఆ పార్టీ నుంచి  బయటకొచ్చాడు. అనంతరం మోత్కుపల్లి టీఆర్ ఎస్ వైపు అడుగులు వేశారు. కానీ గులాబీ అధినేత నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇటు కాంగ్రెస్ - బీజేపీ కూడా మోత్కుపల్లిని పట్టించుకోలేదు. దీంతో ఎట్టకేలకు తన సొంత నియోజకవర్గమైన ఆలేరు స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.

విలేకరులతో మాట్లాడిన మోత్కుపల్లి నర్సింహులు ‘ఆలేరు ప్రజల అభీష్టం మేరకు  ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు రేపు యాదగిరి గుట్టలో ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. సభ ఏర్పాట్లను తన మద్దతుదారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం వివిధ పార్టీల నేతలతో మోత్కుపల్లి సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి. కానీ చేరికలపై ఆయన ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య  పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యి జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు.  టీఆర్ఎస్ లోకి కూడా వెళదామనుకున్నా కేసీఆర్ నుంచి స్పందన లేదట.. సో ఎట్టకేలకు ఆయన ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగబోతున్నారు.
Tags:    

Similar News