ఈటెలను అంతలా మార్చేసిన కిషన్ రెడ్డి

Update: 2020-08-05 17:34 GMT
ఇద్దరు అధికారపక్షానికి చెందిన వారే. ఉన్నత పదవుల్లో ఉన్నోళ్లే. అలాంటోళ్లు ఒకరితో ఒకరు పోటీ పడినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి? సదరు నేతల తీరు ఎలా ఉంటుంది? అన్నది ఇటీవల జరిగిన పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. తెలంగాణలో కరోనా రోగుల విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వ లోపాల్ని అదే పనిగా కాంగ్రెస్ నేతలు ఎత్తి చూపుతుంటే.. బీజేపీ నేతలు సరిగా రియాక్టు కావటం లేదన్న విమర్శలు వినిపించాయి.

అన్నింటికి మించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న గాంధీ ఆసుపత్రిపైనా పలు విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రి వాటిని పట్టించుకోవటం లేదని.. ఇది సరైన పద్దతి కాదన్న మాట వినిపించింది. ఇలాంటివేళ.. ఆదివారం అనూహ్యంగా గాంధీ ఆసుపత్రిని.. గచ్చిబౌలిలోని టిమ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి పరిస్థితుల్ని పరిశీలించేందుకు స్వయంగా పీపీఈ కిట్లుధరించి వార్డుల్లో తిరిగారు.

కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి అంత సాహసం చేస్తే.. ఆ ప్రభావం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ మీద ఉండకుండా ఉంటుందా? అందుకేనేమో.. ఇప్పటివరకూ పీపీఈ సూట్ ధరించి గాంధీలోని వార్డుల్ని పరిశీలించని ఈటెల.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పీపీఈ సూట్ ధరించి రోగుల యోగ క్షేమాలు.. అక్కడ జరుగుతున్న వైద్యం గురించి ఆరా తీయటం గమనార్హం.

అంతేకాదు.. కిషన్ రెడ్డి రంగంలోకి దిగటం.. మైలేజీ కొట్టేయటాన్ని గుర్తించిన టీఆర్ఎస్ సర్కారు.. ఆసుపత్రుల మీద ఇటీవల కాలంలో వస్తున్న ఆరోపణల మీద ఫోకస్ పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన వరుస పెట్టి రెండు రోజులుగా రెండు ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవటం తెలిసిందే. ఇదంతా కిషన్ రెడ్డికి మైలేజీ దక్కకుండా చేయటానికి పడుతున్న పాట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండు ఆసుపత్రుల్ని పరిశీలించిన సమయంలో కిషన్ రెడ్డి రాష్ట్ర సర్కారుపై ఒక్క విమర్శ కూడా చేసింది లేదు. అయినప్పటికీ టీఆర్ఎస్ సర్కారు అంతలా రియాక్టు కావటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక్క విమర్శ చేయకుండానే.. ఈటెలను కిషన్ రెడ్డి బాగానే కంగారు పెట్టారన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News