స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు..వర్కౌట్ అయిందా..?

Update: 2019-10-16 01:30 GMT
పాలనలో అనుభవం లేకపోయిన ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సీఎం జగన్ ప్రజలని మెప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే అనేక సంచలన నిర్ణయాలు - పథకాలు ప్రవేశ పెట్టారు. జగన్ తీసుకునే నిర్ణయాలు - పథకాల వల్ల అన్నీ వర్గాల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారనే చెప్పొచ్చు.  అయితే జగన్ తీసుకున్నకొన్ని నిర్ణయాల పట్ల అందరి కంటే నిరుద్యోగులు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు.

ఎందుకంటే తన పాదయాత్ర సందర్భంగా జగన్ ఎక్కువగా గుర్తించిన సమస్య నిరుద్యోగం. దశాబ్దం పైగా ఏపీని నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ప్రభుత్వాలు మారినా, ఈ సమస్యని తగ్గించలేకపోయారు. కానీ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన అయిదునెలల్లోపే నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన జగన్..గ్రామ / వార్డు వాలంటీర్లు - గ్రామ/వార్డు సచివాలయాల పేరిట లక్షల్లో ఉద్యోగాలు కల్పించారు. అలాగే ప్రభుత్వ వైన్ షాప్ ల్లో కూడా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించారు.

ఇక ప్రతి ఏడాది జనవరిలో రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రతి పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే  స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తు. దీని వల్ల 75 శాతం ప్రభుత్వం - ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. ఇక దీనికి సంబంధించిన బిల్లుని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ఆమోదించడం కూడా జరిగింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. స్థానికతకు మండలం, జిల్లా లేదా రాష్ట్రాన్ని ఆయా పరిస్థితులను బట్టి ప్రమాణికంగా తీసుకుంటారు.

దీని వల్ల ప్రతి యువకుడు లబ్ది పొందనున్నారు. ఇక ఈ నిర్ణయంపై నిరుద్యోగ యువత కూడా సంతృప్తిగా ఉంది. ఈ నిర్ణయాని వాలంటీర్లు,సచివాలయాల ఉద్యోగాల్లో విజయవంతంగా అమలు చేశారు. తాజాగా కూడా రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తానికి నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించడం, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం లాంటి నిర్ణయాలు జగన్ మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.


Tags:    

Similar News