ముస్లిం చేతిలో హిందూ టెంపుల్ సెక్యూరిటీ

Update: 2016-07-25 07:36 GMT
ప్రపంచం మొత్తం మత ఛాందసంతో కొట్టుకునే పరిస్థితి. తీవ్ర అసహనంతో చోటు చేసుకుంటున్న తీవ్రవాద కార్యకలాపాలతో ప్రతి ఒక్కరిని అనుమానంగా చూసే దుస్థితి నెలకొంది. దీనికిభిన్నంగా మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనమనే ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక హిందూ దేవాలయానికి ఒక ముస్లింను సెక్యూరిటీ అధికారిగా నియమించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ ఉదంతలోకి వెళితే.. ఇండియా పోలీస్ నగరంలోని ఒక హిందూ దేవాలయానికి భద్రతా అధికారింగా ఒక ముస్లిం వ్యక్తిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మత సామరస్యానికి.. సోషల్ రిలేషన్స్ కు ఈ ఉదంతం పెద్ద ఉదాహరణగా పలువురు అభివర్ణిస్తున్నారు. హిందూ టెంపుల్ కు సెక్యూరిటీ అధికారిగా నియమితమైన వ్యక్తి పేరు జావెద్ ఖాన్. ముంబయికి చెందిన జావెద్.. కిక్ బాక్సింగ్.. తైక్వాండోలలో విజేత. భార్య.. పిల్లలతో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. తాజాగా సెక్యూరిటీ అధికారిగా నియామకం జరిగిన దేవాలయంలోనే ఆయన తన కుమార్తె వివాహాన్ని మరో భారతీయుడితో అక్కడే జరిపించటంతో దేవాలయ వ్యవహారాలు చూసే వారికి ఆయనపై మరింత గౌరవం పెంచేలా చేసింది.

దీంతో.. ఆయన్ను దేవాలయ భద్రతాధికారింగా నియమించాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని జావేద్ దగ్గర ప్రస్తావిస్తే.. అందరి దేవుడు ఒక్కడేనని.. ఎవరికి ఏ రూపంలో కనిపిస్తే ఆ రూపంలో దైవాన్ని కొలుస్తారని.. టెంపుల్ కు వచ్చే వారికి భద్రత కల్పించటం తన బాధ్యత అని.. తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఏమైనా.. జావెద్ నియామకం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News