బ్రేకింగ్: మాజీ సీఎం హఠాన్మరణం

Update: 2021-12-04 03:30 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటీ రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రోశయ్య వయసు 89 సంవత్సరాలు. శనివారం ఉదయం లోబీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు.  ప్రస్తుతం ఆయన భౌతిక కాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది.

కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా రోశయ్య పనిచేశారు.

1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరుఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు.

2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఇక వైఎస్ మరణం తర్వాత 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. గవర్నర్ గా దిగిపోయాక వృద్ధాప్యంతో ఇంటికే పరిమితమయ్యారు.
Tags:    

Similar News