మోస్ట్ డేంజరస్ దిల్లీ పొల్యూషన్

Update: 2017-12-03 15:49 GMT
దేశ రాజధాని దిల్లీ పేరెత్తితే చాలు అమ్మో అంటున్నారు అంతా. గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండడంతో తప్పనిసరైతే తప్ప దిల్లీ వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. దేశ ప్రజలే కాదు విదేశీయులూ దిల్లీ పొల్యూషన్ చూసి తల్లడిల్లిపోతున్నారు. తాజాగా భారత్ - శ్రీలంకల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లు పొల్యూషన్ విషయమై ఫిర్యాదు చేయడం.. ఆట కాసేపు ఆగిపోవడం తెలిసిందే.

అయితే... ప్రస్తుతం ఉన్న కాలుష్యం కంటే గత నెల ప్రారంభంలో దిల్లీ మరింత తీవ్రమైన కాలుష్యాన్ని చవిచూసింది. జనం ఇల్లు వదిలి బయటకు  రాలేదు. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. అంతటి తీవ్రమైన, ప్రమాదకరమైన కాలుష్య పరిస్థితులను ఐరోపా ఉపగ్రహాలు చిత్రీకరించాయి. నవంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని కాలుష్యాన్ని యూరోపియన్ శాటిలైట్ నిక్షిప్తం చేసింది. యూరోపియన్‌ స్సేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) ఈ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

ఈఎస్‌ఏకు చెందిన సెంటినల్ 5పీ ఉపగ్రహం ద్వారా ఈ చిత్రాలను తీశారు. భూగ్రహంపై వాతావరణ మార్పుల్ని ఇది పరిశీలిస్తుంది. మరో ఉపగ్రహ చిత్రంలో ఉత్తర పాట్నా, దక్షిణ రాయపూర్ ప్రాంతాల్లో ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి వెలవడుతున్న కాలుష్యానికి సంబంధించిన చిత్రాలను తీసింది.
Tags:    

Similar News