సీఎం ఇంట్లో చీఫ్ సెక్రటరీని కొట్టిన ఎమ్మెల్యేలు!

Update: 2018-02-20 07:37 GMT
ఇటీవ‌ల వ‌రుస‌గా వార్త‌ల్లో చిక్కుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో చిక్కు వచ్చింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనను ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టారంటూ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్‌ షు ప్రకాశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ కు చీఫ్ సెక్రటరీ ప్రకాశ్ ఈ విషయంపై ఇవాళ ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం కేజ్రీవాల్ నివాసంలో ఈ దాడి ఘటన జరిగినట్లు స‌మాచారం.

అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అజయ్ దత్ - ప్రకాశ్ జర్వాల్‌ లు .. ప్రధాన కార్యదర్శిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను కేజ్రీ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇలాంటి ఘటన ఎప్పుడు చోటుచేసుకోలేదని సీఎంవో కార్యాలయం పేర్కొంది. ఎమ్మెల్యేలు ఎవరిపైనా చేయిచేసుకోలేదని కేజ్రీ ఆఫీసు ఓ లేఖలో స్పష్టం చేసింది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆమ్ ఆద్మీపై సీరియస్ అయ్యాయి. వెంటనే ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త రాజ‌కీయాల కంటే రౌడీయిజానికే ప్రాధాన్యం ఇస్తోంద‌ని విరుచుకుప‌డ్డాయి.
Tags:    

Similar News