విప్ల‌వ ర‌చ‌యిత‌ను విడుద‌ల కోసం జ‌గ‌న్ మ‌నిషి లేఖ‌

Update: 2020-07-19 03:30 GMT
వ‌ర‌వ‌ర‌రావు సుప్ర‌సిద్ధ విప్ల‌వ ర‌చ‌యిత‌. బీమా కోరేగావ్  కేసులో అరెస్టై 22 నెలలుగా ముంబైలోని తలైజా జైలులో ఉంటున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. వ‌ర‌వ‌ర‌రావు విడుద‌ల‌కు చోర‌వ తీసుకోవాల‌ని కోరారు.

వరవరరావు అనారోగ్యంతో ఉండడం తలుచుకుంటే హృదయం చెమ్మగిల్లుతోంది త‌న లేఖ‌లో భూమ‌న పేర్కొన్నారు. 46 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు నేను ఉన్నప్పుడు మనతోపాటు సహచరుడు వరవరరావు అని ఆనాటి సంద‌ర్భాన్ని వెంక‌య్య‌నాయుడుకు భూమ‌న గుర్తు చేశారు. వరవరరావు  ఈ స్థితిలో నిర్బంధించడం అవసరమా..? అని ప్ర‌శ్నించారు. 81 సంవత్సరాలు ఉన్న వరవరరావుపై ప్రభుత్వం దయ చూపాలని పేర్కొన్న ఆయ‌న సిద్ధాంత నిబద్ధుడైన వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులైన మీరు సానుభూతితో కాపాడండి అని విజ్ఞ‌ప్తి చేశారు.

కాగా, భీమా కోరేగావ్‌ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసి తలోజా జైలుకు తరలించింది. 22 నెలలుగా జైల్లో ఉన్న వరవరరావును మే నెలలో జేజే  ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ…చికిత్స పూర్తి కాకముందే మళ్లీ జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో  ఆయన కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు వెంటనే ఆయనకు చికిత్స అందించాలని డిమాండ్ చేయడంతో జైలు అధికారులు ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News