వంగవీటికీ బాబు మార్కు ఝలక్..!

Update: 2019-03-19 07:12 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన వెంటనే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరలేదు. దీంతో.. అతడు కాస్త ఆలోచనలో పడ్డాడని వార్తలు వచ్చాయి. చంద్రబాబును మరీ గుడ్డిగా నమ్మేసి వంగవీటి తెలుగుదేశం పార్టీలోకి చేరడం లేదని అంతా అనుకున్నారు.

ఆయన మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోయే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే చంద్రబాబు నాయుడు వంగవీటిని మళ్లీ అలా ప్రశాంతంగా ఉండనీయలేదు. మళ్లీ లీకులు ఇచ్చారు. వంగవీటికి ఎంపీ టికెట్ అని తన మీడియాలో అచ్చేయించారు.

నరసరావు పేట, అనకాపల్లి..అంటూ ఊరించారు. రాధా వచ్చి చేరడమే ఆలస్యం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి అలాంటి ఊహాగానాలు రావడం, తెల్లారాకా  వంగవీటి వెళ్లి టీడీపీలో చేరడం జరిగిపోయింది. ఆ పరిణామాల మధ్యన.. ఆయనకు టికెట్ నిజంగానే దక్కుతుందని అమాయకులు అనుకున్నారు.

అయితే ఎంపీ సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారు అయిన నేపథ్యంలో.. వంగవీటికి దక్కింది చంద్రబాబు హ్యాండేనని స్పష్టం అయ్యింది. ఆయనకు ఎక్కడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు, ఎంపీ టికెట్టూ ఖరారు చేయలేదు. అంతకు ముందు ఇచ్చింది ఉత్తుత్తి లీకులే అని స్పష్టం అయిపోయింది.

ఇప్పుడు టీడీపీలో వంగవీటి పరిస్థితి ఏమిటి..అంటే అక్కడ పోటీ చేసేంత సీన్ లేని నేతల మధ్యలో ఈయనా ఒకరు అని జనాలు అనుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వంగవీటికి మచిలీపట్నం ఎంపీ లేదా విజయవాడ ఈస్ట్ టికెట్లను కేటాయించే ప్రతిపాదనలు ఉండేవి. వాటికి నో చెప్పి వచ్చిన వంగవీటి పరిస్థితి ఎన్నికల ముందు ఇలా తయారైంది!
Tags:    

Similar News