జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రం ప్ర‌శంస‌.. ఎందుకంటే..

Update: 2022-02-23 13:52 GMT
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన 6వ కామన్ రివ్యూ మిషన్ (సిఆర్ఎం) ప్రతినిధుల బృందం ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. అద్భుతంగా ప‌నిచేస్తున్నారంటూ.. అధికారుల‌ను.. ప్ర‌భుత్వాన్ని కూడా కొనియాడింది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. ఈ బృందం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించింది. వివిధ పథకాల అమలు తీరును ప‌రిశీలించింది. ఆయా జిల్లాల్లోని ఒక్కొక్క  మండల౦లో ఒక్కొక్క గ్రామ పంచయతీ చొప్పున క్షేత్ర పర్యటన జరిపి లబ్దిదారులను కలుసుకుని మాట్లాడి, వారి అభిప్రాయాలను సేకరించారు.

రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పథకాలైన ఎంజిఎన్ఆర్ఇజిఎస్, పిఎం.కె.ఎస్.వై,  డిడియు-జికెవై, పిఎం.జి.ఎస్.వై, పిఎం.ఎ.వై(హౌసింగ్)  ఎస్.ఎజి.వై, సెర్ప్  అమలు  తీరు తెన్నులను పరిశీలించారు.  పథకాల లక్ష్యం నేరవేరుతున్నదా లేదా, ఒకవేళ లేనట్లయితే దానికి కారణాలు ఏమిటి, అమలులో ఉత్తమ ఆచరణలు, పథకాల పట్ల ప్రజల సంతృప్తి, అసంతృప్తులను, ఆమోదాలు ఎలా ఉన్నాయి. అమలు తీరులో ఉన్న అంతరాలు, సవరించుకోవాల్సిన అంశాలు తదితరాల అన్నింటిని ఈ బృందం పరిశీలించి, ప్రజల ఆలోచనలు, అమలు తీరు, సలహాలు సూచనలు వీటన్నింటిని క్రోడీకరించి నివేదిక రూపంలో భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది.  

క్షేత్ర పర్యటన అనంతరం  తాడేపల్లిలోని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, వివిధ పథకాల అధికారులతో సిఆర్ఎం బృందం  సమీక్షా సమావేశం నిర్వహించింది.  ముఖ్యంగా రాష్ట్రంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ అమలు పటిష్టంగా, సమగ్రంగా అమలవుతోందని, ఉపాధి హామీలో చేపడుతున్న రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమ౦ అద్భుతంగా ఉందని, అరకులోని కాఫీ తోటల గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరిగిందని, వ్యక్తిగతంగా లాభాలు పొందుతున్నారని సమీక్షా సమావేశ౦లో అన్నారు.  

ఉపాధి ప‌నుల‌ మెటీరియల్ నిధులతో నిర్మిస్తున్న సచివాలయాల భవనాలు గ్రామాల రూపురేఖలు మార్చివేస్తున్నాయని, ఇది దేశానికే ఆదర్శంగా ఉందని, అనేక సేవలు గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ దేశమంతా పెట్టాలని  సిఫార్స్ చేయబోతున్నామని  అంటూ, డిబిటి కన్నా రాష్ట్రంలో ప్రతి నెల మొదటి తారీఖునే ఇంటింటికి తిరిగి ఇస్తున్న పెన్షన్ విధానం  అద్భుతంగా ఉందని, వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని బృందం సభ్యులు ప్రసంశించారు. చెత్త సేకరించి దానిని సేంద్రియ ఎరువుగా మార్చి, రసాయన రహిత సేద్యాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ౦పై ప్రసంశలు కురిపించారు.

రాష్ట్రంలో ఆయా పథకాల అమలులో ఉద్యోగస్తులు ఆశక్తిగా, చురుకుగా పనిచేస్తూ అద్భుత పటిమను కనపరుస్తున్నారని వారు అన్నారు.  అలాగే బృందం సభ్యులు మాట్లాడుతూ ఇజిఎస్ లో వ్యక్తిగత ఆస్తులు ఏర్పాటు చేసే పనుల సంఖ్యను పెంచుకోవాలని, పిఎంజిఎస్ వై నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని  సూచించారు. 
Tags:    

Similar News