విదేశాలు వద్దు.. స్వదేశమే ముద్దు.. ఇండో అమెరికన్లలో కొత్త ఆలోచన
ప్రపంచమంతా వలసల చరిత్రే. కొన్నేళ్ల తర్వాత ఆ పాత వలదారులు కొత్త వలసదారులపై వివక్ష చూపుతుంటారు. కొత్త వలసదారుల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నామంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.;
ప్రపంచమంతా వలసల చరిత్రే. కొన్నేళ్ల తర్వాత ఆ పాత వలదారులు కొత్త వలసదారులపై వివక్ష చూపుతుంటారు. కొత్త వలసదారుల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నామంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. స్థానిక నైపుణ్యాన్ని తొక్కిపట్టి వలస నైపుణ్యాన్ని తెచ్చుకుంటున్నారని విమర్శలు చేస్తారు. విదేశీ నిపుణులను ఆహ్వానించేది ఎవరు.. కంపెనీలు. కంపెనీలు ఎవరివి .. స్థానికులవి. మరి స్థానికులను కాకుండా విదేశీ నిపుణులను ఎందుకు తీసుకుంటారంటే.. ఒకటి స్థానికుల కంటే విదేశీయులు నైపుణ్యంగల వారైఉంటారు. లేదా తక్కువ జీతానికి వస్తారు. అందుకే కంపెనీలు స్థానికుల కంటే విదేశీయులపై ఎక్కువ ఆసక్తి చూపుతాయి. ఇది కేవలం వ్యాపారం. ఇక్కడ స్థానికులు, విదేశీయులు అన్న తేడా ఉండదు. పెట్టబడికి కావాల్సింది లాభం. స్థానికత కాదు. ఇప్పుడు అమెరికాలో విదేశీయులపై వివక్ష చూపుతున్న స్థానికుల కథ కూడా ఇలాంటిదే.
టెక్సాస్ లో భారతీయులపై వివక్ష
ఉద్యోగం కోసం వచ్చిన హెచ్1బి వీసాదారులు తమ నగరాన్ని ఆక్రమించారంటూ ఫ్రిస్కో కౌన్సిల్ సమావేశంలో కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. వీసా మోసాల కారణంగా భారతీయుల జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం భారతీయులతో నిండిపోకముందే అమెరికన్లు మేల్కోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొనే వీసా విధానానికి తాము వ్యతిరేకమని సోషల్ మీడియా కన్జర్వేటివ్ ఇన్ఫ్లూయన్సర్లు కైలీ కాంబెల్, మార్క్ పలాసియానో వ్యాఖ్యానించారు. దీనిని స్థానికంగా నివాసం ఉంటున్న భారతీయులు ఖండించారు. వీసా మోసాలకు తామూ వ్యతిరేకమేనని, కానీ భారతీయుల వల్ల నష్టం జరుగుతుందని మాట్లాడటం సరికాదని చెప్పారు. భారతీయులు ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక భారతీయులకు ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ మద్దతు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2010లో టెక్సాలో భారతీయుల జనాభా 10 శాతం. ఇప్ప్పుడు 30 శాతంగా ఉంది.
అసమర్థతకు ముసుగు స్థానికత..
ఇలాంటి నినాదాలు, వ్యాఖ్యానాలు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వినిపిస్తాయి. కనిపిస్తాయి. అవసరం ఉన్నప్పుడు విదేశీయులకు పెద్దపీఠ వేస్తారు. వారి జనాభా పెరగగానే స్థానికుల ఉపాధి లాక్కుంటున్నారని ఆరోపిస్తారు. తక్కువ జీతానికి పనిచేస్తారని, లేదా నిపుణులని మాత్రమే విదేశీయులకు అవకాశాలు ఇస్తారు. పనికి రానివారికి ఏ దేశము ఆహ్వానం పంపదు. ఉద్యోగం ఇవ్వదు. విదేశీయుల చమటతో అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వారిని చిన్నచూపు చూడటం, వివక్ష ప్రకటించడం సర్వసాధారణంగా మారుతోంది. ఈరోజు టెక్ రంగంలో అమెరికా ఆధిపత్యానికి భారతీయులే కారణం. లేదంటే అమెరికాకు అగ్రరాజ్యంగా స్థానం ఉండేది కాదు. కానీ అమెరికన్లు కొందరు దీనిని ఒప్పుకోరు. తమ ఉపాధి లాక్కుంటున్నారని మాట్లాడుతారు.
ఇండియన్లు స్వదేశానికి వస్తే..
విదేశాల్లో ఉంటున్న భారతీయులు వెనక్కి వస్తే అది ఇండియాకే లాభం. టెక్ రంగంలో ఆధిపత్యం చెలాయించగలదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు వారిని రానివ్వవు. అందుకే విదేశాల్లో ఉంటున్నారు. వివక్ష ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో ఉన్న భద్రత, పని వాతావరణం ఇండియాలో కల్పిస్తే ఇక్కడికే వస్తారు. కానీ ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక కారణం.