ధిక్కరణ చర్యల వరకు తెచ్చుకోరని భావిస్తున్నాం: స్పీకర్ ప్రసాదరావుపై సుప్రీంకోర్టు కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఇచ్చిన ఆదేశా లను ఆయన సంపూర్ణంగా అమలు చేస్తారని భావిస్తామని పేర్కొంది.;
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఇచ్చిన ఆదేశా లను ఆయన సంపూర్ణంగా అమలు చేస్తారని భావిస్తామని పేర్కొంది. కోర్టు ధిక్కరణ వంటి కీలక చర్యల వరకు ఆయన తెచ్చుకోరని ఆశిస్తున్నామని తెలిపింది. అలా కాని పక్షంలో ధిక్కరణ చర్యలు చేపట్టేందుకు తమకు ఎప్పుడైనా అవకాశం ఉంటుందని.. ఈ విషయంలో వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఏం జరిగింది?
2023లో విజయం దక్కించుకున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. 10 మంది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆ పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో నే స్పీకర్ ప్రసాదరావుకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. కానీ, ఆయన అప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేల విచారణనే పూర్తి చేశారు. ఆ తర్వాత మరింత గడువు కోరగా.. మరో నాలుగు వారాలు ఇచ్చారు.
ఈ సమయం కూడా అయిపోయిన నేపథ్యంలో బీఆర్ ఎస్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో మరో ఇద్దరుఎమ్మల్యేల విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు వివరించారు. మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న బీఆర్ ఎస్ తరఫు న్యాయవాది.. కోర్టు ఇచ్చిన సమయం ముగిసిందని.. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసును సాగదీస్తున్నారని.. కాబట్టి స్పీకర్పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
అంతే కాదు.. నాలుగు వారాల గడువు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ సమయంలో కోర్టు స్పందిస్తూ.. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం తమకు చేరిందని.. అన్నీ అనుకున్నట్టుగా జరిపోవాలని తాము కూడా ఆశించడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో కొన్నింటికి సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున విచారణకు మరో మూడువారాల సమయం ఇస్తున్నట్టు తెలిపారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ధిక్కరణ చర్యల వరకు ఆయన(స్పీకర్) తెచ్చుకుంటారని తాము అనుకోవడం లేదని తెలిపింది.