భారతీయుల ఆగ్రహం.. షాక్ తిన్న షావోమీ

Update: 2020-10-19 17:34 GMT
చైనా అంటేనే భారతీయులు నిప్పులు చెరుగుతున్నారు. సరిహద్దుల్లో 20 మంది సైనికులను చంపిన చైనాపై భారతీయులు అట్టుడుకుతున్నారు. ఇప్పటికీ సరిహద్దుల్లో సైనికులను దించి అరుణాచల్ ప్రదేశ్, లఢక్ లలో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ క్రమంలోనే భారత్ ఇప్పటికే చైనాకు చెందిన వందల యాప్స్ ను నిషేధించింది.

తాజాగా చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్.. భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయే షావోమీ (ఎంఐ) ఫోన్లలో బయటపడ్డ ఓ పొరపాటు కారణంగా భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో షావోమీపై భారతీయ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు ఎంఐపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.

తాజాగా షావోమీ ఫోన్లలోని వాతావరణ వివరాలు చెప్పే యాప్ లలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమే కనిపించకుండా పోవడం కలకలం రేపింది. అసలే అది చైనా కంపెనీ కావడం.. పైగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఆ ఫోన్లలో కనిపించకపోవడంతో భారతీయులకు కోపం నాషాళానికి ఎక్కింది. దీంతో మనోళ్లు రెచ్చిపోయారు. షావోమీ సంస్థపై దుమ్మెత్తిపోశారు.

ఈ ట్రోలింగ్, విమర్శలపై షావోమీ సంస్థ వెంటనే వివరణ ఇచ్చింది. సాంకేతికలోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని.. థర్డ్ పార్టీ ద్వారా వాతావరణ వివరాలు తమకు అందుతాయని తెలిపింది. భారత్ లో తమ కార్యకలాపాలు ప్రభుత్వ విధానాలకు లోబడే ఉంటాయని ప్రకటన చేసింది.
Tags:    

Similar News