ఎందుకు స‌డెన్‌గా 'బైబై జ‌గ‌న్‌' అవుతోంది?

Update: 2022-04-09 10:30 GMT
సోష‌ల్ మీడియాలో అక‌స్మాత్తుగా.. ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి ఒక కామెంట్ స‌హా.. కొన్ని పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే అంశంపై అంద‌రూ దృష్టి పెట్టారు. విష‌యం ఏంటంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌.. పీకే స‌ల‌హా మేర‌కు.. ``బై బై బాబు`` అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కులు పోస్టులు పెట్టేవారు. కామెంట్లు సైతం చేసేవారు. అయితే.. ఇప్పుడు.. మూడేళ్ల త‌ర్వాత‌.  అనూహ్యంగా ఇదే కామెంట్‌.. సీఎం జ‌గ‌న్ కు అన్వ‌యిస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ``బైబై జ‌గ‌న్‌`` అంటూ.. వ్యాఖ్య‌లు దూసుకువ‌స్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం.. ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది.

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాలే దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త మూడేళ్లుగా.. వైసీపీ పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు.. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌ని.. టీడీపీ నేత‌లు త‌ర‌చుగా చెబుతున్న విష‌యం తెలిసిందే. ధ‌ర‌లు పెరిగిపోవ‌డం.. ఇసుక లేక రియ‌ల్ రంగం దెబ్బ‌తిన‌డం.. వంటివి అంద‌రికీ తెలిసిందే. ఇక‌, చెత్త‌ప‌న్ను.. ఇత‌ర‌త్రా ప‌న్నుల బాదుడు కూడా.. భారీ ఎత్తున ప్ర‌జ‌ల న‌డ్డి విరిచేసింది. దీంతో జ‌గ‌న్‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే.. ప్ర‌జ‌ల‌ను కూడా క‌లుస్తున్నారు.ఇ క‌, నాసిర‌కం మ‌ద్యం.. భారీ ఎత్తున ధ‌ర‌లు పెరిగిపోవ‌డం.. వంటివి కూడా తీవ్ర‌స్థాయిలో వివాదంగా మారింది.

ఇక‌, తాజాగా.. రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు.. పెరిగిపోయి.. ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. నాలుగు రోజుల కింద‌టే.. ఈ నెల 1 నుంచి భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాలు మోపిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా.. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై తీవ్ర‌మైన భారాలు మోపారు. ఈ భారాలు మ‌రిచిపోక‌ముందే.. ఏసీలు నిలుపుద‌ల చేయాల‌ని.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక‌, విద్యుత్ కోత‌లు పెరిగిపోయాయి. ప‌ల్లెల్లో 12 గంట‌లు.. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో 8 గంట‌ల చొప్పున విద్యుత్ కోత‌లు అమ‌లు చేస్తు న్నారు. దీంతో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనూ.. విద్యుత్ కోత‌ల కార‌ణంగా.. సెల్ ఫోన్ టార్చ్‌ల వెలుగులో ఒక గ‌ర్భిణీకి ప్ర‌స‌వం చేసిన ఘ‌ట‌న రాష్ట్రాన్ని కుదిపేసింది.

మ‌రోవైపు.. ప‌రిశ్ర‌మల విద్యుత్ విష‌యంలో ఆంక్ష‌లు విధించారు. వారిని ఒక‌రోజు.. ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌టిస్తూ.. ప్ర‌భుత్వ‌మే ఆదేశా లు జారీ చేసింది. వాస్త‌వానికి ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి ఒక‌రోజు సెల‌వు ఎలానూ ఉంటుంది. అప్పుడు క‌రెంటు వినియోగం ఏమీ ఉండ‌దు. కానీ.. దీనికి అద‌నంగా మ‌రోరోజు ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌టించింది. దీంతో మ‌రో రోజు ప‌రిశ్ర‌మ‌లు ప‌నిచేయ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ప‌రిశ్ర‌మ‌ల‌పై ఆధార‌ప‌డిన వారు ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఉన్న వారి వేత‌నాలు కూడా త‌గ్గిపోతాయి.ఉత్ప‌త్తులు మంద‌గించి.. ధ‌ర‌లు పెరిగిపోతాయి.

ఇప్ప‌టికే క‌రోనా.. ఎఫెక్ట్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రోవైపు.. ఇసుక విధానంతో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌నేది ప్ర‌జ‌ల మాట‌గా వినిపిస్తోంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలో బైబై జ‌గ‌న్ అనే కామెంట్ సోష‌ల్ మీడియాను కుదిపేస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News