బ‌ట‌న్ నొక్కితే.. ఎమ్మెల్యేలు ఏం చేయాలి సీఎం సార్‌!

Update: 2022-04-09 02:30 GMT
రాష్ట్రంలో అధికార‌ వైసీపీకి సీఎం కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా కూడా ఎన్నో ఖ‌ర్చులు పెట్టుకుని.. ప్ర‌జ‌ల్లో తిరిగి.. వారికి అనేక హామీలు ఇచ్చి.. దండాలు పెట్టి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓటు వేయించుకుని గెలిచిన వారే. అయితే.. అలా గెలిచిన వారికి జ‌గ‌న్ స‌ర్కారు ఏమాత్రం విలువ ఇవ్వ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌జ‌ల‌కు సంబందించిన ఏ ప‌నిచేసేందుకూ వారికి అవ‌కాశం లేకుండా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. ఎందుకంటే.. ప్ర‌జాప్ర‌తినిదులుగా.. ఉన్న ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర‌త్రా ప్ర‌భుత్వం ప్రారంభించే కార్య‌క్ర‌మాలే కీల‌కం. ఆయా కార్య‌క్ర‌మాల‌ను వారు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తారు.

అంటే.. ఒక కార్య‌క్ర‌మం.. ప్ర‌భుత్వం ప్రారంభించాక‌.. అక్క‌డి నుంచి నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు తీసుకువెళ్లి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతారు. వాటిని అందిస్తారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల మ‌ధ్య గుర్తింపు పొందుతారు. `మా ఎమ్మెల్యే మాకు ఏదో చేస్తున్నా రు` అని ప్ర‌జ‌ల నుంచి మంచి మార్కులు కూడా వేయించుకుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇదే బూస్ట్ మాదిరిగా వారికి ఉప‌యోగ ప‌డు తుంది.

అయితే.. ఇప్పుడు.. ఆ అవ‌కాశం త‌మ‌కు లేకుండా సీఎం జ‌గ‌న్ చేస్తున్నార‌ని.. వైసీపీ ఎమ్మెల్యేలు గ‌గ్గోలు పెడుతున్నారు. త‌మ‌కు క‌నీసం ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌ని వాపోతున్నారు. దీనికి కార‌ణం.. ఏపీ స‌ర్కారు ఏం చేస్తున్నా.. ఎమ్మెల్యేల‌తో సంబంధం లేదు.

ఏ ప‌థ‌కం ప్రారంభిస్తున్నా.. ఎమ్మెల్యేల‌తో ప‌నిలేకుండా చేస్తోంది. అదేస‌మ‌యంలో ఆయా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ల‌బ్ధిదారుల ఎంపిక విష‌యంలోనూ.. ఎమ్మెల్యేల‌తో ప‌నిలేకుండానే.. వైసీపీ స‌ర్కారు ప‌నిచేసుకుని పోతోంది. దీంతో ప్ర‌జ‌ల‌కు-ప్ర‌జాప్ర‌తినిధు లుగా  ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య సంబంధాలు నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్నాయి.

మ‌ధ్య‌లో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన జ‌గ‌న్‌.. అన్నింటినీ.. వీరినే వినియోగించుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏం చేయాల‌న్నా.. ప్ర‌జ‌ల‌కు ఏం కావాల‌న్నా.. వ‌లంటీర్ల‌నే వాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేలు.. త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని వాపోతున్నారు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోకి వెళ్తే.. మ‌మ్మ‌ల్ని గుర్తుప ప‌ట్టే ప‌రిస్తితి కూడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

అయినా.. సీఎం జ‌గ‌న్ త‌న వైఖ‌రిని మార్చుకోవ‌డం లేదు. తాజాగా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఆయ‌న "జగనన్న వసతి దీవెన" రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. ఈ క్ర‌మంలో ఓ బ‌ట‌న్ నొక్క‌గానే .. విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లోకి  కోట్ల రూపాయ‌ల నిధులు చేరిపోయాయి. ఇక‌, నేరుగా ఇఅలా నిధులు ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి చేరిపోవ‌డంతో .. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది.

గ‌తంలో అయితే.. సీఎం ఒక కార్య‌క్ర‌మం ప్రారంభించ‌గానే.. దానిని ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో బ‌హిరంగ స‌భ‌లు పెట్టి అమ‌లు చేసేవారు. దీంతో ఎమ్మెల్యేలంటే.. ప్ర‌జ‌ల‌కు విలువ‌, గౌర‌వం ఉండేది.. కానీ.. ఇప్పుడు ఈ రెండూ లేకుండా జ‌గ‌న్ పాల‌న చేస్తున్నార‌ని.. కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే గుస‌గుస‌లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
Tags:    

Similar News