ఆ సీఎం బస్సు చూస్తే బాపురే అనాల్సిందేనట

Update: 2016-10-27 10:35 GMT
దేశంలో అత్యంత విలాసవంతమైన బస్సు యజమాని ఎవరంటే బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అని చెబుతుంటారు. ఆయనకు చెందిన బస్సు విలాసాలకు.. సౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతుంటారు. తాజాగా.. దాన్ని తలదన్నేలా ఒకబస్సును తయారు చేయించారు యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. వచ్చే నెల మూడు నుంచి ఈ బస్సులో ఆయన రథయాత్రను షురూ చేయనున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించటానికి.. ప్రచారం చేయటానికి వీలుగా ఆయన ఒక అత్యాధునిక సౌకర్యాలున్న బస్సును తయారు చేయించారు.

బెంజ్ కు చెందిన ఈ బస్సులో సౌకర్యాలకు సంబంధించి చిన్న ఉదాహరణ చెప్పాలంటే.. బస్సులో నుంచి.. పై టాప్ మీదకు వెళ్లి.. ప్రసంగించటానికి ఒక లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటి సౌకర్యాలు ఈ బస్సులో కోకొల్లలుగా చెప్పొచ్చు. 2012 ఎన్నికల సమయంలో కూడా రథయాత్రతో యూపీ మొత్తాన్ని కలయతిరిగిన అఖిలేశ్.. భారీ విజయాన్ని నమోదు చేశారు. తాజాగా మరోసారి ఈ తరహా మేజిక్ ను ప్రదర్శించాలని భావిస్తున్న ఆయన.. కుటుంబ కలహాలను పక్కన పెట్టి.. పార్టీ ప్రచారంపై దృష్టి సారించాలని భావిస్తున్నారు.

సీఎం స్థాయి నేతలు ఏరి కోరి.. తమకున్న వసతులతో కూడిన బస్సును కొనుగోలు తర్వాత.. మరికొన్ని మార్పులు చేర్పులకు రూ.50లక్షల వరకూ ఖర్చు చేయటం కామన్. అయితే.. అఖిలేశ్ యాదవ్ చేయించిన మార్పులు కోటి పైనే అయినట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగారి అవసరాలకు కోసం తయారు చేయించిన ఈ ప్రత్యేక బస్సులో ఉన్న వసతుల్ని ఒక్క లుక్కు వేస్తే.. పది చక్రాలున్న బెంజ్ బస్సు మొత్తం పూర్తిగా బుల్లెట్ ఫ్రూప్. హైఫిడెలిటీ సౌండ్ సిస్టమ్ తో పాటు.. వీడియోలు చూపించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్లు ఉంటాయి. ఇక.. రిలాక్స్ అయ్యేందుకు వీలుగా లగ్జరీ కుర్చీలు.. బస్సులోనే రెస్ట్ రూం.. వంట గది.. ప్లష్ వాష్ రూమ్ తో పాటు.. వైఫై సౌకర్యం.. టీవీతో పాటు..అత్యాధునిక ఏసీ సిస్టం ఈ బస్సు సొంతం. సింఫుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. కదిలే ఇంద్రభవనం అనుకోండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News