మోడీ దెబ్బ‌కు ఆ గుహకు ఇప్పుడు మ‌స్తు డిమాండ్‌!

Update: 2019-06-30 04:55 GMT
స‌మ‌కాలీన భార‌తంలో మోడీ లాంటి ప్ర‌ధాని ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌నే చెప్పాలి. త‌న తీరుతో ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లోకి ఎక్కే ఆయ‌న‌.. కొన్ని సంద‌ర్భాల్లో తీసుకునే నిర్ణ‌యాలు ఊహ‌కు అంద‌ని రీతిలో ఉంటాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఉన్న‌ట్లుండి తాను ధ్యానం చేసుకునేందుకు అక్క‌డెక్క‌డో హిమాల‌య సానువుల్లోని మారుమూల ఉన్న గుహ‌లోకి వెళ్లి రోజంతా ధ్యానం చేసిన ఆయ‌న కార‌ణంగా ఇప్పుడా గుహ ఫుల్ ఫేమ‌స్ గా మారింది.

మోడీ కార‌ణంగా ఇప్పుడా గుహ‌కు వ‌చ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. కేధార్ నాథ్ ఆల‌యానికి  కాస్త దూరంలో ఉండే గుహ‌లో మోడీ ప్ర‌త్యేకంగా ధ్యానం చేయ‌టంతో ఇప్పుడా ప్ర‌దేశానికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడా గుహ‌కు ధ్యాన‌గుహ‌గా పేరొచ్చింది. ఈ గుహ‌లో ధ్యానం చేసుకునేందుకు ఆస‌క్తి ఎక్కువైంది. ఈ గుహ‌ను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవ‌టానికి ఎంక్వ‌యిరీలు పెరిగిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ డిమాండ్ ఎంత ఎక్కువ‌గా ఉందంటే.. జులై మొత్తం బుకింగ్ లు పూర్తి అయ్యాయ‌ని.. ఆగ‌స్ట్.. సెప్టెంబ‌రు.. అక్టోబ‌రు ల‌లో కూడా చాలా రోజులు బుకింగ్ లు పూర్తి అయిన‌ట్లుగా అధికారులు చెబుతున్నారు. గ‌ఢ్వాల్ మండ‌ల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ ద్వారా బుకింగ్ లు చేసుకుంటున్నారు. తాజాగా పెరిగిన డిమాండ్ నేప‌థ్యంలో మోడీ ధ్యానం చేసిన గుహ‌కు ద‌గ్గ‌ర్లోని మ‌రో మూడు గుహ‌ల్లోనూ ధ్యానం చేసుకునేలా త‌యారు చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో అధికారులు ఉన్నారు. మొత్తానికి త‌న ధ్యానంతో మోడీ దేశంలో మ‌రో కొత్త ప‌ర్యాట‌క ప్ర‌దేశాన్ని త‌యారు చేశార‌ని చెప్పాలి.
Tags:    

Similar News