ఇంత ఘోరమా: ఒకే దెబ్బకు 17 మంది మృతి

Update: 2016-06-05 06:57 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. ముంబయి.. పుణె నేషనల్ హైవే మీద ఒక లగ్జరీ బస్సు కారణంగా 17 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అమితవేగంతో వెళుతున్న లగ్జరీ బస్సు.. రెండు కార్లను ఢీ కొట్టిన ఘటనలో  17 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 20 అడుగుల పై నుంచి బస్సు కింద పడటంతో మృతుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఘటనాస్థలంలోని వారి సమాచారం ప్రకారం.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. యాక్సిడెంట్ సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు మొదలు పెట్టారు.

నిఖిల్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్త వల్లే జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రాయగఢ్ జిల్లా శివఖార్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన 17 మందిలో 10 మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఒక చిన్నారి(ఎనిమిది నెలలు) ఉన్నారు. మరో 33 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని పాన్వెల్ లోని పనాసియా ఆసుపత్రికి తరలించారు.
Tags:    

Similar News