తమ్ముళ్ల అసంతృప్తికి అసలు కారణాలు ఇవే బాబూ.. !
టీడీపీలో అసంతృప్తి నానాటికీ పెరుగుతోందా? నాయకులకు-పార్టీకి మధ్య కూడా దూరం పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
టీడీపీలో అసంతృప్తి నానాటికీ పెరుగుతోందా? నాయకులకు-పార్టీకి మధ్య కూడా దూరం పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో ఎప్పుడూ ఉండే కొందరు నాయకులు మాత్రమే పటి ష్టంగా ఉన్నారు. కానీ, గత 15 ఏళ్ల కాలంలో పార్టీలో చేరిన వారు.. ఇటీవల కాలంలో కండువాలు కప్పుకొన్న వారు.. మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు.. నాయకులను నిందిస్తున్న తీరు కూడా బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీపరంగా తీసుకునే నిర్ణయాలను సమీక్షించాల్సి ఉంటుందని కూడా కొందరు చెబుతున్నారు. పదవుల నుంచి గుర్తింపు వరకు నాయకులు కోరుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఆదుకున్న నాయకులను ఇప్పటికీ గుర్తించలేకపోవడాన్ని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కూడా నాయకులను గుర్తించడంలోనూ.. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సహకరించడంలోనూ ఏమీ కనిపించడం లేదన్నది కొందరు నాయకులు చెబుతున్న మాట.
ఇదే ఇప్పుడు పార్టీలో అసంతృప్తులను పెంచుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా పదేపదే చెబు తున్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను మంత్రులకు అప్పగిస్తున్నారు. కానీ, ఇది చాలదన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. విషయానికి వస్తే.. ప్రధానంగా గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడాన్ని నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది పెద్ద మైనస్గా మారింది. ఇక, కొత్తగా ఎన్నికైన నాయకులు.. తమపై పెత్తనం చేస్తున్నారని.. సుదీర్ఘకాలంగా ఉన్న నేతలు చెబుతున్నారు.
ఈ రెండు పరిణామాలు తీవ్రంగా టీడీపీని ప్రభావితం చేస్తున్నాయి. ఈ రెండు విషయాలను పట్టించుకుని తమకు న్యాయం చేయాలని నాయకులు కోరుతున్నారు. దీనికి తోడు నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఎమ్మెల్యేలు అసంతృప్తిగానే ఉన్నారు. తాము సూచించిన వారికి పదవులు ఇవ్వకపోవడం.. అసలు జాబితాలో కూడా లేని నాయకులకు అవకాశం ఇవ్వడం వంటివి కూడా క్షేత్రస్థాయిలో నాయకులకు-నాయకులకు మధ్య దూరం పెంచుతున్నాయి. ఈ పరిణామాలను సరిచేయాల్సి ఉందని అంటున్నారు. ఈ అసంతృప్తిని ఇప్పుడు సరిచేయకపోతే.. ఎన్నికల నాటికి పెద్ద సమస్యగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.